హైదరాబాద్: ప్రధాని మోదీ నేడు హైదరాబాద్కు (Hyderabad) రానున్నారు. గచ్చిబౌలిలోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ) 20వ వార్షికోత్సవంలో ప్రధాని పాల్గొంటారు. ఈ నేపథ్యంలో నగరంలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఐటీకారిడార్లో మధ్యాహ్నం 1 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిబంధనలు అమలులో ఉంటాయని అధికారులు తెలిపారు. దీంతో వాహనదారులు ఆ సమయంలో ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలని సూచించారు.
గచ్చిబౌలి నుంచి లింగంపల్లి వైపు వెళ్లే వాహనదారులు గచ్చిబౌలి జంక్షన్ వద్ద మలుపుతీసుకుని బొటానికల్ గార్డెన్, కొండాపూర్ ఏరియా దవాఖాన, మజీద్ బండ కమాన్, హెచ్సీయూ డిపో రోడ్ మీదుగా వెళ్లాలి.
విప్రో జంక్షన్ నుంచి లింగంపల్లి వైపు వెళ్లే వాహనాలు.. క్యూ సిటీ, గౌలిదొడ్డి, గోపన్పల్లి క్రాస్రోడ్, హెచ్సీయూ బ్యాక్ గేట్, నల్లగండ్ల మీదుగా పోవాల్సి ఉంటుంది.
విప్రో జంక్షన్ నుంచి గచ్చిబౌలి వైపు వెళ్లేవారు ఫెయిర్ ఫీల్డ్ హోటల్, నానక్రాంగూడ రోటరీ, ఓఆర్ఆర్ రోడ్, ఎల్ అండ్ టీ టవర్స్ మీదుగా వాహనాలను మళ్లిస్తారు.
ప్రధాని మోదీ టూర్ షెడ్యూల్
ప్రధాని మోదీ మధ్యాహ్నం 1.25 గంటలకు ప్రత్యేక విమానంలో బేగంపేట ఎయిర్పోర్టుకు చేరుకుంటారు. అటునుంచి ప్రత్యేక హెలికాప్టర్లో 1.50 గంటలకు హెచ్సీయూ క్యాంపస్కు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డుమార్గంలో వెళ్లి.. 2 గంటల సమయంలో ఐఎస్బీకి చేరుకుంటారు.
మధ్యాహ్నం 3.15 గంటల వరకు ఐఎస్బీ వార్షికోత్సవం, స్నాతకోత్సవంలో ప్రధాని మోదీ పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించడంతోపాటు, పలువురు విద్యార్థులకు పట్టాలు అందజేస్తారు.
అనంతరం తిరిగి బేగంపేటకు చేరుకుని 3.55 గంటలకు ప్రత్యేక విమానంలో చెన్నైకి వెళ్తారు.