యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి బాలాలయంలో బుధవారం స్వామి వారికి సంప్రదాయ పూజలు శాస్ర్తోక్తంగా కొనసాగాయి. వేకువజామునే ఆలయాన్ని తెరిచిన అర్చకులు సుప్రభాతంతో స్వామి వారిని మేల్కొలిపి స్వయంభువులకు పంచామృతాలతో అభిషేకం వైభవంగా నిర్వహించారు. స్వామి వారి బాలాలయ కవచ మూర్తులకు నిత్యారాధనలు జరిపారు. ఉత్సవ మండపంలో ఉత్సవ విగ్రహాలను పట్టువస్ర్తాలు, స్వర్ణ అభరణాలతో అలంకరించి నిజాభిషేకం, తులసి అర్చనలు చేపట్టారు.
లక్ష్మీ నరసింహులను దివ్య మనోహరంగా అలంకరించి సుదర్శన నారసింహహోమం, లక్ష్మీనరసింహుల నిత్య తిరు కల్యాణం, అలంకార సేవోత్సవాలు నిర్వహించారు. మండపంలో అష్టోత్తర పూజలు జరిపారు. కొండపైన శివాలయంలో నిత్యారాధనలు శైవ సంప్రదాయంగా జరిగాయి. అమ్మవారికి కుంకుమార్చనలు నిర్వహించారు. ఆలయంలో ప్రతిష్టాత్మ కంగా జరుపుకునే సత్యనారాయణ స్వామి వ్రతాల్లో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు.
స్వామి వారిని దర్శించుకున్న వేగేశ్న ఫౌండేషన్ ప్రతినిధి రాజు..
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారిని అన్న ప్రసాదం కాంఫ్లెక్స్ దాత, వేగేశ్న ఫౌండేషన్ ప్రతినిధి రాజు బుధవారం స్వామివారిని దర్శింకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈసందర్భంగా ఆలయ అర్చకులు, అధికారులు ఆయనకు స్వామి వారి వేద ఆశీర్వచనం అందజేశారు. ఆలయ ఈవో స్వామి వారి ప్రసాదాన్ని అందజేశారు. అనంతరం రాజు యాదాద్రి ఆల య నిర్మాణాలను పరిశీలించి, నిర్మాణాలు మహాద్భుతంగా జరుగుతున్నాయని అభిప్రాయపడ్డారు. యాదాద్రి కొండ కింద కల్యాణకట్ట వద్ద నిర్మిస్తున్న అన్నప్రసాద కాంప్లెక్స్కు వేగేశ్న ఫౌండేషన్ వారు రూ.11కోట్లను విరాళంగా అందజేశారు.