హైదరాబాద్, ఏప్రిల్ 11 (నమస్తే తెలంగాణ): అంగన్వాడీ కేంద్రాలకు రేషన్ తరలింపునకు గ్రామ పంచాయతీలకు అందజేసిన ట్రాక్టర్లను వినియోగించుకొనేందుకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. రాష్ట్రంలోని 31,711 అంగన్వాడీ కేంద్రాలు, 3,989 మినీ కేంద్రాలకు కావలసిన బియ్యాన్ని అంగన్వాడీ టీచర్లు, ఆయాలే రేషన్ దుకాణం నుంచి తెచ్చుకొంటున్నారు. కొన్నిచోట్ల దూరాభారంతో నిర్వాహకులకు ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
ఈ పరిస్థితిని మార్చాలని అంగన్వాడీ టీచర్లు ప్రభుత్వాన్ని కోరారు. దీంతో బియ్యం రవాణాకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీల్లో ఉన్న ట్రాక్టర్లు, మినీ ట్రాక్టర్లను వినియోగించుకోవాలని సూచించింది. గ్రామీణ ప్రాంతాల్లో కలెక్టర్లు, పట్టణ ప్రాంతాల్లో మున్సిపల్ కమిషనర్ల సహకారంతో ఏర్పాట్లు చేసుకోవాలని రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమశాఖ కమిషనర్ దివ్యాదేవరాజన్ ఆ శాఖ అధికారులకు ఉత్తర్వులు జారీచేశారు. వాహనాలు అందుబాటులో లేనిచోట కలెక్టర్ అనుమతితో టెండర్ పిలిచి బియ్యం సరఫరా చేయాలని ప్రాజెక్టు అధికారులను ఆదేశించారు.
ప్రభుత్వ మానవీయతకు నిదర్శనం
అంగన్వాడీ టీచర్లు, ఆయాల పట్ల ప్రభుత్వం ప్రతి అంశంలోనూ మానవీయతను చూపుతున్నది. రేషన్ సమస్యను విన్నవించిన వెంటనే సీఎం కేసీఆర్ మానవతా దృక్పథంతో మంచి నిర్ణయం తీసుకొన్నారు. ఈ నిర్ణయం అంగన్వాడీ కేంద్రాల నిర్వాహకులకు ఎంతగానో ఉపయోగపడనున్నది.
– నల్లా భారతి, తెలంగాణ రాష్ట్ర అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు