ఇద్దరి దుర్మరణం.. మరొకరికి తీవ్ర గాయాలు
కొల్చారం, జూన్ 28: విద్యార్థులపైకి ట్రాక్టర్ దూసుకెళ్లడంతో ఇద్దరు దుర్మరణం చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన మెదక్ జిల్లా రంగంపేటలో మంగళవారం చోటుచేసుకొన్నది. కొల్చారం ఎస్సై శ్రీనివాస్గౌడ్, ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. మెదక్కు చెందిన శివాయిపల్లి రాజు, పోచమ్మల కుమారుడు జశ్వంత్ (15), తూర్పాట్ల శంకర్, లక్ష్మి దంపతుల కుమారుడు రజనీకాంత్ (13) రంగంపేట జడ్పీ ఉన్నత పాఠశాలలో చదువుతూ స్థానికంగా ఉన్న సాంఘిక సంక్షేమ హాస్టల్లో ఉంటున్నారు. జశ్వంత్ తొమ్మిదో తరగతి, రజనీకాంత్ ఎనిమిదో తరగతి చదువుతున్నారు.
వీరు మంగళవారం పాఠశాలకు వెళ్లకుండా హాస్టల్లోనే ఉండిపోయారు. మధ్యాహ్న భోజన సమయంలో పాఠశాలకు వెళ్లిన వీరు సోమవారం ఇదే పాఠశాలలో అడ్మిషన్ తీసుకొన్న మెదక్కు చెందిన రామ్చరణ్ను స్కూల్ను నుంచి హాస్టల్కు తీసుకెళ్తుండగా మార్గమధ్యంలో వెనుక నుంచి అతివేగంగా వచ్చిన ట్రాక్టర్ ఈ ముగ్గురిని ఢీకొట్టింది. ఈ ఘటనలో జశ్వంత్ అక్కడికక్కడే మృతి చెందగా, దవాఖానకు తరలిస్తుండగా రజనీకాంత్ మరణించాడు. రామ్చరణ్ రెండుకాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. హాస్టల్ వార్డెన్, ఉపాధ్యాయుల నిర్లక్ష్యంతోనే ముగ్గురు విద్యార్థులు ప్రమాదం బారిన పడ్డారని స్థానికులు గంటసేపు రోడ్డుపై ఆందోళన చేశారు. మెదక్ రూరల్ సీఐ విజయ్, ఎస్సై శ్రీనివాస్గౌడ్, రూరల్ ఎస్సై సంతోష్రెడ్డి ఘటనా స్థలాన్ని సందర్శించి ఆందోళనకారులనచ్చజెప్పి మృతదేహాలను పోస్టుమార్టం కోసం మెదక్ దవాఖానకు తరలించారు.