TSPSC | హైదరాబాద్, ఫిబ్రవరి 20 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో 2022 ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్ల ఏడాది కాగా, 2023 పరీక్షల సంవత్సరం. నిరుడు రాష్ట్రంలో వరుస నోటిఫికేషన్లు వచ్చాయి. మార్చి 9న అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ఉద్యోగ ప్రకటన చేయగా, ఆ తర్వాత అనతికాలంలో ఆయా నియామక సంస్థలు నోటిఫికేషన్లు ఇచ్చాయి. 2023లోనే పరీక్షలన్నీ నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నది. కొత్తగా ఉద్యోగాల్లో చేరిన అభ్యర్థులకు ఈ ఆర్థిక సంవత్సరం నుంచే వేతనాలు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేసింది. ఇందుకోసం 2023-24 బడ్జెట్లో రూ.వెయ్యి కోట్లు కూడా కేటాయించింది. యుద్ధప్రాతిపదికన ఉద్యోగాల భర్తీ ప్రక్రియను పూర్తిచేయాలని నియామక సంస్థలకు సూచించింది. దీనికి అనుగుణంగా నియామక సంస్థలు ఉద్యోగాలన్నీ చకచకా భర్తీ చేసేందుకు కార్యాచరణను సిద్ధం చేశాయి. డిసెంబర్ వరకు టీఎస్పీఎస్సీ పరీక్షల తేదీలను ఖరారు చేసింది. పరీక్షల నిర్వహణకు ముందుగానే అన్ని ఏర్పాట్లు చేస్తున్నది. ఒక్క కేంద్రంలో చిన్న పొరబాటు జరిగినా మొత్తం పరీక్షపై ప్రభావం పడే ప్రమాదం ఉన్నందున, కమిషన్ ఒకటికి రెండుసార్లు సరిచూసుకొంటున్నది. ఇంత పకడ్బందీగా ఏర్పాట్లు చేసిన తర్వాత ఏదైనా ఒక పరీక్ష తేదీని మారిస్తే మళ్లీ నిర్వహణ పెద్ద తలనొప్పే!
డిసెంబర్ వరకు బిజీ బిజీ
ఈ ఏడాది మార్చి నుంచి డిసెంబర్ నెలాఖరు వరకు శని,ఆదివారాలన్నీ బిజీ షెడ్యూల్తో నిండిపోయాయి. మార్చి 5న అసిస్టెంట్ ఇంజినీర్, 12న టౌన్ ప్లానింగ్ అండ్ బిల్డింగ్ ఓవర్సీస్, 15, 16 తేదీల్లో వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్స్ పరీక్షలు ఉండగా, అదే నెలలో ఇంటర్ పరీక్షలు ఉన్నాయి. ఏప్రిల్ 4న హార్టికల్చర్ ఆఫీసర్స్, 23న ఏఎంవీఐ, 25న అగ్రికల్చర్ ఆఫీసర్స్, 26, 27 తేదీల్లో భూగర్భజల శాఖలో గెజిటెడ్ క్యాటగిరీ పరీక్షలతోపాటు టెన్త్ పరీక్షలు ఉన్నాయి. మే నెలలో 7న డ్రగ్ ఇన్స్పెక్టర్, 13న పాలిటెక్నిక్ లెక్చరర్, 15, 16న భూగర్భ జలశాఖలో నాన్ గెజిటెడ్, 17న పీడీ, లైబ్రేరియన్ ఉద్యోగాలకు పరీక్షలు జరుగనున్నాయి. అదే నెలలో వివిధ కోర్సుల సెట్ పరీక్షలు, సివిల్స్ ప్రిలిమ్స్ పరీక్ష ఉన్నాయి.
జూన్లో 5 నుంచి 12వ తేదీ వరకు గ్రూప్-1 మెయిన్తోపాటు జేఈఈ, యూజీసీ నెట్, ఐఈఎస్, జియో సైంటిస్ట్, ఇంజినీరింగ్ సర్వీసెస్ మెయిన్స్, సీఏ ఇంటర్ పరీక్షలు జరుగనున్నాయి. జూలైలో గ్రూప్-4తోపాటు యూపీఎస్సీ, కంబైన్డ్ మెడికల్ పరీక్షలు, ఆగస్టులో సెంట్రల్ ఆర్మ్డ్ ఫోర్సెస్, ఐబీపీఎస్ ఆర్ఆర్బీ ఆఫీసర్, ఆఫీస్ అసిస్టెంట్, ఐబీపీఎస్ క్లర్ ఎగ్జామ్స్ ఉన్నాయి. సెప్టెంబర్లో ఐబీపీఎస్ క్లర్స్, ఎన్డీఏ, సీడీఎస్, ఐబీపీఎస్ ఆర్ఆర్బీ, సివిల్స్ మెయిన్, ఐబీపీఎస్ ప్రొబేషనరీ పోస్టులకు పరీక్షల షెడ్యూల్ ఉన్నది. అక్టోబర్లో ఐబీపీఎస్, యూపీఎస్సీ, నవంబర్లో ఐబీపీఎస్, ఐఎఫ్ఎస్ మెయిన్స్, డిసెంబర్లో మిలిటరీ కళాశాల ప్రవేశ పరీక్ష, యూపీఎస్సీ, ఐబీపీఎస్ స్పెషలిస్ట్ ఉద్యోగాలకు పరీక్షలు జరుగనున్నాయి. డిసెంబర్ వరకు షెడ్యూల్ ఇంత బిజీగా ఉండటంతో గ్రూప్ -2, 3 తేదీలనే ఖరారు చేయలేదు. ఈ నేపథ్యంలో ప్రకటించిన పరీక్షలను వాయిదా వేయడం అంటే ఇక ఈ సంవత్సరం ఆ పరీక్ష నిర్వహణ కష్టమే.
మారిస్తే ఇబ్బందులు
టీఎస్పీఎస్సీ ఇప్పటి వరకు 25 రకాల ఉద్యోగాలను నోటిఫికేషన్లు ఇచ్చింది. ఆ ఉద్యోగాలకు పరీక్ష తేదీల ఖరారు పెద్ద పరీక్షగా మారింది. ప్రధానంగా ఈ నెల 26న డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ (డీఏవో) పరీక్ష రోజునే మరో నాలుగు పరీక్షలు ఉన్నాయి. గతేడాది ఆగస్టులోనే డీఏవో పరీక్ష తేదీని టీఎస్పీఎస్సీ ప్రకటించింది. ఆ తర్వాత స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ జూనియర్ ఇంజినీర్, పీఆర్టీ, ఎయిర్పోర్ట్ అథారిటీ, యూజీసీ నెట్ పరీక్షలు ఫిబ్రవరి 26నే నిర్వహించనున్నట్టు ఆయా సంస్థలు ప్రకటించాయి. ఈ నేపథ్యంలో డీఏవో పరీక్ష తేదీని మార్చాలని కొందరు కమిషన్కు విజ్ఞప్తి చేశారు. అయితే, ఆ పరీక్ష తేదీని మారిస్తే ఈ ఏడాది ఎగ్జామ్ నిర్వహణ కష్టమేనని టీఎస్పీఎస్సీ అధికారులు చెప్తుతున్నారు. 53 ఉద్యోగాలకు అత్యధికంగా 1,06,263 మంది దరఖాస్తు చేశారని, కొంతమంది కోసం తేదీని మారిస్తే మిగతా అందరినీ ఇబ్బంది పెట్టినట్టేనని కమిషన్ భావిస్తున్నది. అందుకే ఈ నెల 26నే డీఏవో పరీక్ష నిర్వహించాలని కమిషన్ నిర్ణయించింది. హాల్ టికెట్లను సైతం వెబ్సైట్లో ఉంచింది. ఒకసారి పరీక్ష వాయిదా పడితే మరో తేదీ ఇప్పట్లో అందుబాటులో లేదని, పరీక్ష నిర్వహణలో జాప్యం జరిగితే సీరియస్గా ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు నష్టం జరిగే ప్రమాదం ఉన్నదని కమిషన్ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.