హైదరాబాద్, డిసెంబర్ 26 (నమస్తే తెలంగాణ): టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి సోమవారం ఎర్రవల్లిలో నిర్వహించనున్న రచ్చబండ కార్యక్రమాన్ని బహిష్కరిస్తున్నట్టు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ప్రకటించారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో కాంగ్రెస్ ఏకైక ఎమ్మెల్యేగా, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న తనకు రచ్చబండపై సమాచారం ఇవ్వకపోవడం ఆవేదనకు గురిచేసిందని తెలిపారు. రచ్చబండ పూర్తిగా రేవంత్రెడ్డి వ్యక్తిగత ఎజెండా అని ఆదివారం ఒక ప్రకటనలో విమర్శించారు. రేవంత్రెడ్డి ఏకపక్ష నిర్ణయాల వల్ల పార్టీకి నష్టం జరుగుతున్నదని పేర్కొన్నారు. పార్టీలో చర్చించకుండా నిర్ణయాలు తీసుకొనే అధికారం రేవంత్కు ఎక్కడిదని ప్రశ్నించారు. పార్టీలో చీలికలు తెచ్చి, విడదీసేందుకు ప్రయత్నిస్తున్న రేవంత్ వ్యవహార శైలిపై అధిష్ఠానానికి సోమవారం ఫిర్యాదు చేస్తానని వెల్లడించారు. తాను ఇంచార్జిగా ఉన్న కరీంనగర్, వరంగల్, ఖమ్మం, భువనగిరి పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలోని నాయకులతో కలిసి ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించనున్నట్టు తెలిపారు.