ముషీరాబాద్, మే 25: రాష్ట్రంలో కులాల మధ్య టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి చిచ్చు పెడుతున్నారని టీఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ మండిపడ్డారు. జాతీయ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండి కుల సంఘం నాయకునిలా మాట్లాడుతున్న రేవంత్.. రెడ్డి సంఘం నడుపుకోవాలని హితవు పలికారు.
బుధవారం హైదరాబాద్ విద్యానగర్లోని ఆ సంఘం కార్యాలయంలో వంగపల్లి మీడియాతో మాట్లాడారు. రెడ్లకు పగ్గాలు ఇస్తేనే పార్టీలకు మనుగడ అంటూ అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న రేవంత్రెడ్డిపై ధ్వజమెత్తారు. జనాభాలో అధిక శాతం ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీలు ఎప్పటికి మీ పార్టీ జెండాలు మోసే వారిగానే మిగిలిపోవాలా అని ప్రశ్నించారు. రేవంత్ వాఖ్యలు వ్యక్తిగతమా లేదా పార్టీ అభిప్రాయమో చెప్పాలని డిమాండ్ చేశారు.