ఖైరతాబాద్, అక్టోబర్ 15: ‘టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి రాష్ట్రంలో కాంగ్రెస్ను ఖతం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు. టికెట్లు అమ్ముకొని పార్టీని నమ్ముకున్నోళ్లను నిండా ముంచాడు. ఆయన వైఖరి నచ్చకనే నేను, నా భార్య కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నాం’ అని ఆ పార్టీ ఉప్పల్ నియోజకవర్గ అధ్యక్షుడు సింగిరెడ్డి సోమశేఖర్రెడ్డి చెప్పారు. సోమాజిగూడ ప్రెస్క్లబ్లో ఆదివారం తన సతీమణి, ఏఎస్రావునగర్ కార్పొరేటర్ సింగిరెడ్డి శిరీషతో కలిసి ఆయన రేవంత్రెడ్డిపై దుమ్మెత్తిపోశారు. తాను దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీలో పనిచేశానని, తన కుటుంబసభ్యులు కూడా ఆ పార్టీలోనే అనేక పదవులను చేపట్టారని గుర్తు చేశారు. 2014లో తనకు టికెట్ ఇస్తానని చెప్పి ఇవ్వలేదని, 2018లో పొత్తుపేరుతో మరోసారి మోసగించారని, నేడు రేవంత్రెడ్డి టికెట్లు అమ్ముకొని తనకు మొండిచేయి చూపాడని మండిపడ్డారు. నాడు రేవంత్ టీడీపీని నాశనం చేశాడని, నేడు కాంగ్రెస్ పార్టీని సైతం చేస్తున్నాడని విమర్శించారు.
ప్రస్తుతం టికెట్లు దక్కించుకున్న అభ్యర్థుల్లో అధిక శాతం రేవంత్రెడ్డి చలవతోనే వచ్చారని, కోట్లాది రూపాయలు చేతులు మారాయని ఆరోపించారు. వారందరినీ ప్రైవేట్ ఆర్మీలా తయారు చేసుకున్నాడని, ఆయనకు ముఖ్యమంత్రి పదవీ ఇవ్వకుంటే తిరుగుబాటు చేస్తానని అధిష్ఠానాన్ని బెదిరించేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నాడని విమర్శించారు. టీడీపీ నుంచి వచ్చిన రేవంత్ను అందరూ ఛీత్కరించుకుంటే తానే రేవంత్ టీమ్ను తయారు చేసి తన సొంత ఖర్చులతో అతనికి కాన్వాయ్ని ఏర్పాటు చేశానని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా వందలాది మంది రేవంత్రెడ్డి బాధితులు ఉన్నారని, రేపటి నుంచి ఆయన ఓటమే లక్ష్యంగా పనిచేస్తానని తెలిపారు. ప్రజలకు ఏ పార్టీ మంచి చేస్తుందో ఆ పార్టీలోనే చేరుతానని స్పష్టంచేశారు.