హైదరాబాద్, సెప్టెంబర్ 3 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ పార్టీ నిబంధనలు అనే లక్ష్మణరేఖను దాటితే ఎంతటి నాయకులపైనైనా కఠిన చర్యలు తప్పవని టీపీసీసీ క్రమశిక్షణా కమిటీ చైర్మన్ మల్లు రవి స్పష్టంచేశారు. ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ పార్టీ లైన్ దాటినందుకే దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖను, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డిని పదవుల నుంచి తొలగించామని తెలిపారు.
పార్టీ క్యాడర్కు బలమైన సందేశం ఇవ్వాలనే ఉద్దేశంతోనే తాను సమర్పించిన క్రమశిక్షణా కమిటీ నివేదిక ఆధారంగా ఏఐసీసీ ఈ నిర్ణయం తీసుకున్నదని తెలిపారు. ముఖ్యమంత్రిపై తన కుమార్తె చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను మంత్రి సురేఖ కనీసం ఖండించకపోవడం తీవ్రమైన తప్పిదమని, పార్టీ అధ్యక్షుడు మల్లికార్జునఖర్గే స్వయంగా రెండుసార్లు అపాయింట్మెంట్ ఇచ్చి మాట్లాడినప్పటికీ, తన కుమార్తె చేసింది తప్పని సురేఖ చెప్పలేకపోయారని రవి పేర్కొన్నారు.
రాజకీయ కుట్ర, కుల వివక్ష లేదు
సురేఖపై చర్యల వెనుక ఎలాంటి రాజకీయ కుట్ర లేదా కుల వివక్ష లేదని, కేవలం ఆమె తప్పుల ఆధారంగానే క్రమశిక్షణా చర్యలు తీసుకున్నామని మల్లు రవి చెప్పారు. కొండా సురేఖ, ఆమె భర్త మురళి, చిన్నారెడ్డిలపై తనకు వ్యక్తిగతంగా ఎలాంటి వ్యతిరేకత లేదన్నారు. మహిళను తొలగించారంటూ విపక్షాలు చేసే విమర్శలను ముందే గ్రహించి, బీసీ సామాజికవర్గాలకు సమప్రాధాన్యం కల్పిస్తూ మున్నూరు కాపు వర్గానికి చెందిన గద్వాల విజయలక్ష్మికి రాష్ట్ర ప్రణాళికా బోర్డు వైస్చైర్మన్ పదవిని, పద్మశాలి సామాజికవర్గానికి చెందిన గుండు సుధారాణికి కాకతీయ టెక్స్టైల్స్ డెవలప్మెంట్ చైర్మన్ పదవులను కేటాయించినట్టు తెలిపారు. మంత్రి పదవి నుంచి తొలగించిన తర్వాత సురేఖ చేస్తున్న ఆరోపణలను సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదని, పార్టీలో ఏవైనా సమస్యలు ఉంటే అంతర్గతంగా కూర్చుని చర్చించుకోవాలని హితవు పలికారు. కొండా సురేఖను మంత్రివర్గం నుంచి తప్పించినప్పటికీ, ఆమె కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగాలని పార్టీ పక్షాన కోరుకుంటున్నామని తెలిపారు.
కోమటిరెడ్డి బ్రదర్స్పైనా విచారణ
సురేఖపై వచ్చినట్టే కోమటిరెడ్డి బ్రదర్స్ పై ఫిర్యాదులు వస్తే వారిపైనా విచారణ ఉంటుందని మల్లు రవి స్పష్టంచేశారు. ఇక టికెట్ల పంపిణీపై, నేనే సీఎంగా కొనసాగుతానని రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలు కేవలం కార్యకర్తలు, పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపేందుకేనని, వాటిని వివాదం చేయాల్సిన పనిలేదని రవి పేర్కొన్నారు.