హైదరాబాద్, మే 13 (నమస్తే తెలంగాణ): కేంద్రమంత్రి బండి సంజయ్ కుమారుడు బండి సాయి భగీరథ్ అరెస్టును ఆపడం ఎవరి వల్ల సాధ్యం కాదని టీపీసీసీ చీఫ్ మహేష్కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. బుధవారం గాంధీభవన్లో నిర్వహించిన చిట్చాట్ సందర్భంగా భగీరథ్ కేసు వ్యవహారంపై ఆయన స్పందించారు.
బండిసంజయ్ కుమారుడి కేసులో ఎలాంటి జాప్యం జరుగడం లేదన్నారు. చట్టం తన పని తాను చేసుకుంటూ పోతూనే ఉన్నదని చెప్పారు. తప్పకుండా భగీరథ్ను అరెస్ట్ చేస్తారని, ఇందులో అనుమానమే లేదన్నారు. భగీరథ్ను తప్పించే అవసరం కాంగ్రెస్కు లేదని చెప్పారు. ప్రస్తుతం భగీరథ్ పరారీలో ఉన్నాడని తెలిసిందన్నారు. ఒకవేళ విదేశాలకు వెళ్లినా, తిరిగి తీసుకురావడం పెద్ద కష్టమేమీ కాదని పేర్కొన్నారు.