నాగార్జునసాగర్ : నాగార్జున సాగర్ టు శ్రీశైలం లాంచీ ప్రయాణం సోమవారం ప్రారంభమైంది. తెలంగాణ పర్యాటక అభివృద్ధి శాఖ నందికొండ హిల్ కాలనీ లాంచ్ స్టేషన్ నుంచి లాంచీని టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కర్ణ బ్రహ్మానందరెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. తొలిరోజు లాంచీలో 20 మంది ప్రయాణికులు శ్రీశైలం దేవస్థానాని బయల్దేరారు. కృష్ణా నదిలో ఆరు గంటల పాటు ప్రయాణం కొనసాగి సాయంత్రానికి శ్రీశైలం చేరుకోనుంది లాంచీ.
కృష్ణమ్మ సవ్వడుల మధ్య సాగే ఈ ప్రయాణంలో చాకలిగట్టు సమీపించగానే జింకలు , దుప్పులు కనువిందు చేస్తాయి. గౌతమ బుద్ధుడి చారిత్రాత్మక విశేషాలను, జీవిత గాథలను తెలిపే నాగార్జునకొండ సమీపంగా సాగుతూ కొద్ది ప్రయాణంలోనే పురాతన ఏలేశ్వర గట్టు దర్శనమిస్తుంది. ఈ ప్రయాణంలో చారిత్రక కోటలు, కొండలు, జలపాతాలు, మొసళ్లు, అందమైన పర్వతాలు ముందుకు వెళ్లే కొద్దీ చూడ ముచ్చటైన అందాలు కనివిందు చేస్తూనే ఉంటాయి. సాయంత్రానికి లింగాల గట్టు చేరుకుంటుంది. ఆ తర్వాత పర్యాటకులు శ్రీశైలం మల్లికార్జున స్వామి దర్శనం చేసుకొని మరునాడు సాయంత్రానికి లాంచీలో నందికొండ చేరుకుంటారు. ఆహ్లాదకరమైన నల్లమల అడవి దృశ్యాలతో పాటు ఆధ్యాత్మికమైన వాతావరణం మధ్య ప్రయాణం హాయిగా సాగిపోతుంది. ఈ మరవలేని స్మృతులను మిగులుస్తుందంటూ పర్యాటకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.