హైదరాబాద్, ఆగస్టు 5 (నమస్తే తెలంగాణ) : 2026 సంవత్సరానికిగాను వివిధ సాహిత్య ప్రక్రియల్లో అత్యుత్తమ గ్రంథ రచనలకు తెలంగాణ సాహిత్య అకాడమీ పురస్కారాలు ప్రదానం చేయాలని నిర్ణయించినట్టు తెలంగాణ సాహిత్య అకాడమీ తెలిపింది. కథ, నవల, నాటకం, కవిత్వం, వచన కవిత్వం, పద్యం, గజల్, సాహిత్య పరిశోధన, విమర్శలకు చెందిన గ్రంథాలను విడివిడిగా ఎంపిక చేసి పురస్కారాలకు ఎంపిక చేస్తామని వివరించింది. గ్రంథకర్తలు రాష్ర్టానికి చెందినవారై ఉండాలని, పురస్కార గ్రహీతలకు ప్రశంసాపత్రం, జ్ఞాపిక, రూ.1,01,116 నగదు అందజేయనున్నట్టు వెల్లడించింది. పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తామని పేర్కొన్నది.
మా హక్కులను పరిరక్షించండి ; నల్లమల చెంచుల వినతి
హైదరాబాద్, ఆగస్టు 5 (నమస్తే తెలంగాణ): నల్లమలలో తమ హక్కులను పరిరక్షించాలని జాతీయ మానవ హక్కుల సంఘానికి చెంచు సంఘం నాయకులు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. నల్లమలలో భారత రాజ్యాంగం, అటవీ హక్కుల చట్టం-2006, పీసా చట్టం-1996, ఐదో షెడ్యూల్లో కల్పించిన హక్కులు అమలుకాకముందే పునరావాస చర్యలు చేపడుతున్నారని అభ్యంతరం వ్యక్తంచేశారు. మన్ననూర్లో చెంచుల కోసం ఏర్పాటు చేసిన ఐటీడీఏకు ఐఏఎస్ అధికారిని నియమించాలని, ఖాళీ పోస్టులు భర్తీ చేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు.