Rahul Gandhi-Priyanka | హైదరాబాద్, అక్టోబర్ 18 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ అబద్ధాలే ఆలంబనగా, రాష్ట్రంపై విషం చిమ్మడమే లక్ష్యంగా తమ పర్యటన ప్రారంభించారు. ములుగులో బుధవారం జరిగిన బహిరంగ సభలో ఈ ఇద్దరు అన్నాచెల్లెళ్లు అలవోకగా పచ్చి అబద్ధాలను వల్లెవేశారు. రాష్ట్రంలో బ్రహ్మాండంగా అమలవుతున్న పథకాలను అమలు కావడం లేదంటూ నిస్సిగ్గుగా అసత్య ప్రచారం చేశారు. వాస్తవాలు తెలుసుకోకుండా ఎవరో రాసిచ్చిన స్క్రిప్టును చదివేసి వెళ్లిపోయారు.
పోడు పట్టాలపై నిస్సిగ్గుగా ఆరోపణ
రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేసిన పోడు పట్టాలను తీసుకున్న గిరిజన రైతులను ఇటు స్టేజీ పైనా, అటు స్టేజీ ముందు పెట్టుకొని.. ప్రభుత్వం పోడు పట్టాలు పంపిణీ చేయాలేదంటూ రాహుల్, ప్రియాంక నిస్సిగ్గుగా ఆరోపించారు. ఇటీవల ప్రభుత్వం 1.57 లక్షల కుటుంబాలకు 6.06 లక్షల ఎకరాల పోడు పట్టాలను పంపిణీ చేసింది. ఈ పట్టాలు పొందిన వారిలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే సీతక్క తల్లిదండ్రులు కూడా ఉన్నారు. ఈ సభలో సీతక్క స్టేజీపైనే ఉన్నప్పటికీ అవేవీ పట్టించుకోకుండా పోడు పట్టాలపై అసత్య ప్రచారం చేశారు.
కాళేశ్వరంపై మళ్లీ విషం
రాహుల్గాంధీ రాష్ర్టానికి వచ్చిన ప్రతిసారి కాళేశ్వరంపై విషం కక్కుతున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి అయిన మొత్తం ఖర్చు రూ. 84వేల కోట్లు అయితే ఇందులో రూ. లక్ష కోట్ల అవినీతి జరిగిందంటూ మరోసారి అదే అబద్ధాన్ని వల్లెవేశారు. కాళేశ్వరం వల్ల రైతులకు కలుగుతున్న ప్రయోజనంపై ఏనాడూ ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం గమనార్హం.
డబుల్ బెడ్రూంలు ఇవ్వలేదా!.
రాష్ట్రంలో ఇల్లు లేని పేదలు ఉండొద్దనే ఉద్దేశంతో పూర్తి ఉచితంగా సీఎం కేసీఆర్ పేదల ఆత్మగౌరవాన్ని ప్రతిబించించేలా డబుల్ బెడ్రూం పథకానికి శ్రీకారం చుట్టారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 1.70 లక్షల కుటుంబాలకు డబుల్ బెడ్రూం ఇండ్లను పంపిణీ చేశారు. ఇప్పుడు ఇంటి స్థలం ఉన్న వారికి ఇంటి నిర్మాణానికి రూ. 3 లక్షల ఆర్థిక సాయం అందిస్తున్నారు. అలాంటిదిజజ తెలంగాణలో ఎవరికీ ఇల్లు ఇవ్వలేదంటూ రాహుల్ గాంధీ మాట్లాడటం విడ్డూరంగా ఉన్నది.
రుణమాఫీ చేయలేదా?
రాష్ట్ర ప్రభుత్వం రైతు రుణమాఫీ చేయలేదంటూ రాహుల్ గాంధీ మరో పచ్చి అబద్ధం చెప్పారు. ఇప్పటికే రెండు విడతల్లో సుమారు 23 లక్షల మంది రైతులకు చెందిన రూ.13వేల కోట్ల రుణాలను ప్రభుత్వం మాఫీ చేసింది. ఈ విధంగా 2014లో, ఇప్పుడు రెండుసార్లు కలిసి మొత్తం 58.29 లక్షల మంది రైతులకు రూ. 30 వేల కోట్ల రుణాలను మాఫీ చేసింది. వరుసగా రెండుసార్లు రైతులకు రుణమాఫీ చేసిన రాష్ట్రం దేశంలో తెలంగాణ మాత్రమే.
ధాన్యం కొంటలేరట
నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు అన్న చందంగా ఉంది రాహుల్గాంధీ తీరు. రాహుల్ గాంధీ అమాయకత్వాన్ని చూసి తెలంగాణ రైతులు జాలి పడుతున్నారు. దేశంలో మరే రాష్ట్రం కొనుగోలు చేయని విధంగా రైతులు పండించిన ప్రతి గింజను తెలంగాణ ప్రభుత్వం కొనుగోలు చేస్తున్నది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న ఛత్తీస్గఢ్లో ఎకరానికి 16 క్వింటాళ్ల ధాన్యం మాత్రమే కొనుగోలు చేస్తూ రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నది.
బీఆర్ఎస్ నేతలపై కేసులే లేవంట!
బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు రెండూ ఒక్కటేనంటూ రాహుల్ గాంధీ మరోసారి రాజకీయ అజ్ఞానపు వ్యాఖ్యలు చేశారు. బీజీపీకి బీఆర్ఎస్ మద్దతిస్తున్నది కాబట్టి ఆ పార్టీ నేతలపై కేంద్రం కేసులు పెట్టడం లేదంటూ వింత వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్సీ కవితపై ఈడీ పెట్టిన కేసులు, మంత్రులు గంగుల కమలాకర్, తలసానితో పాటు పలువురు ఎంపీలపై ఐటీ, ఈడీ దాడుల సంగతేంటో రాహుల్ గాంధీ చెప్పాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు.
ధరణితో దోపిడీయా?
ఎవరి భూములపై వారికే హక్కు కల్పించేలా, ఒకరి భూములు మరొకరు ఆక్రమించకుండా ఉండేందుకు ప్రభుత్వం ధరణిని తీసుకొచ్చింది. తద్వారా రాష్ట్రంలో భూ తగాదాలు తగ్గిపోయాయి. తమ భూమికి ఢోకా లేదని రైతులు, ఇతర ప్రజలు గుండెపై చేయి వేసుకొని ప్రశాంతంగా నిద్రపోతున్నారు. రాహుల్ గాంధీ మాత్రం ధరణితో దోచుకుంటున్నారంటూ తప్పుడు ప్రచారం చేయడం గమనార్హం.
ప్రసంగం మధ్యలోనే వెళ్లిపోయిన జనం
వరంగల్, అక్టోబర్ 18 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) :రాహుల్ మాటల్లో నిజాలు లేకపోవడంతో మీటింగ్కు వచ్చిన జనం మధ్యలోనే వెళ్లిపోయారు. భూపాలపల్లి అభ్యర్థి గండ్ర సత్యనారాయణరావు వేదికపైనుంచి కిందికి దిగిపోయారు. ఉత్తమ్కుమార్రెడ్డి, రేవంత్రెడ్డి పిలిచినా మళ్లీ రాలేదు. అంతకుముందు సీతక్క ప్రసంగించిన తర్వాత గండ్ర సత్యనారాయణ మాట్లాడేందుకు సిద్ధమయ్యారు. ఆ సమయంలో పొన్నం ప్రభాకర్ పాటలు, వీడియో ప్లే చేయాలని చెప్పారు. దీంతో గండ్ర సత్యనారాయణ మాట్లాడకుండానే వేదిక దిగి వెళ్లిపోయారు. దీంతో భూపాలపల్లికి చెందిన కాంగ్రెస్ నాయకులు అసంతృప్తికి లోనయ్యారు. తమను కాంగ్రెస్ రాష్ట్ర నేతలు, ములుగు అభ్యర్థి సీతక్క అవమానించారని గండ్ర సత్యనారాయణ వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
రాహుల్ పర్యటన నేపథ్యంలో ములుగు జిల్లా రామాంజాపురంలో బుధవారం పోస్టర్లు వెలిశాయి. మేడారం జాతరకు జాతీయ
హోదా, గిరిజన వర్సిటీపై మాట్లాడని రాహుల్.. ఓట్ల కోసం జిల్లాకు వస్తున్నారంటూ పోస్టర్లలో రాసి ఉంది.
– ములుగు