ఇది కేసీఆర్ ప్రభుత్వ పాలనకు గీటురాయి. తెలంగాణ గత పదేండ్లలో సాధించిన ప్రగతిని ఆర్బీఐ వెల్లడించిన అంకెలే వివరిస్తున్నాయి. థ్యాంక్స్ టు కేసీఆర్
తెలంగాణ అప్పులకుప్పగా మారిందని కాంగ్రెస్, బీజేపీ, సోషల్ మీడియా, యూట్యూబ్ చానళ్లు చేస్తున్న ప్రచారం అబద్ధమని ఫోర్బ్స్ కథనంతో తేటతెల్లమైంది.
హైదరాబాద్, ఫిబ్రవరి 22 (నమస్తే తెలంగాణ): కేసీఆర్ పదేండ్ల పాలనలో రాష్ర్టాన్ని అప్పుల కుప్పగా మార్చారంటూ విమర్శిస్తున్న వారికి, బీఆర్ఎస్ హయాంలో ప్రజలకు ప్రయోజనాలు అందలేదని ప్రచారం చేస్తున్నవారికి జాతీయ మీడియా కథనాలు చెంపపెట్టులాంటి సమాధానం ఇచ్చాయి. జీఎస్డీపీతో పోల్చితే అప్పుల్లో తెలంగాణ అడుగుభాగాన్నే ఉన్నదని, గత ఐదేండ్లలో తలసరి ఆదాయ వృద్ధిరేటులో దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిందని స్పష్టం చేశాయి. రాష్ర్టాల జీఎస్డీపీతో పోల్చితే అప్పులు ఏ మేర ఉన్నాయో విశ్లేషిస్తూ ‘ఫోర్బ్స్ ఇండియా’ ఒక కథనాన్ని ప్రచురించింది. 2023-24 బడ్జెట్ అంచనాల ఆధారంగా ఈ విశ్లేషణ చేసింది. ఇందులో తెలంగాణ జీఎస్డీపీ విలువను దాదాపు రూ.14 లక్షల కోట్లుగా పేర్కొన్నది. రాష్ట్ర రుణాలు జీఎస్డీపీతో పోల్చితే 23.8 శాతంగా ఉన్నట్టు తెలిపింది. అంటే అప్పులు అదుపులోనే ఉన్నాయని స్పష్టం చేసింది. జీఎస్డీపీ-రుణాల మధ్య ఉన్న నిష్పత్తి ఆయా రాష్ర్టాల ఆర్థిక పరిస్థితితోపాటు, ప్రభుత్వ విధానాలను ప్రతిబింబిస్తాయని పేర్కొన్నది. 27 రాష్ర్టాల జాబితాలో తెలంగాణ అతి తక్కువ అప్పులతో కింది నుంచి ఐదో స్థానంలో నిలిచింది. ఈ కథనాన్ని మాజీ మంత్రి హరీశ్రావు ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. ‘అతితక్కువ రుణ భారం ఉన్న రాష్ర్టాల్లో తెలంగాణ ఐదో స్థానంలో నిలిచినట్టు ఫోర్బ్స్ ఇండియా స్పష్టం చేసింది. దీన్నిబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన శ్వేతపత్రం పదేండ్ల కేసీఆర్ పాలనను బదనాం చేయడానికి చేసిన ప్రయత్నమే అని స్పష్టం అవుతున్నది. తెలంగాణ అప్పుల కుప్పగా మారిందంటూ బీజేపీ, సోషల్ మీడియా, కొన్ని యూట్యూబ్ చానళ్లు చేస్తున్న ప్రచారం మొత్తం అబద్ధమని ఫోర్బ్స్ కథనంతో తేటతెల్లం అయ్యింది. సత్యమేవ జయతే’ అని పోస్ట్ చేశారు.
ఐదేండ్లలో తలసరి ఎన్ఎస్డీపీ (నెట్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్) వృద్ధిలో తెలంగాణ అగ్రభాగాన నిలిచిందంటూ ఇటీవల ఆర్బీఐ హ్యాండ్బుక్లో పేర్కొన్నది. స్థిర ధరల వద్ద 2017-18 నుంచి 2022-23 వరకు ఆయా రాష్ర్టాల తలసరి ఎన్ఎస్డీపీ వృద్ధి ఆధారంగా ఆర్బీఐ జాబితా రూపొందించింది. ఇందులో తెలంగాణ 28.52 శాతం వృద్ధిని కనబరిచింది. ఇది కేసీఆర్ ప్రభుత్వ పాలనకు మరో గీటురాయి అని మాజీ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ‘తెలంగాణ గత పదేండ్లలో సాధించిన ప్రగతిని అంకెలే వివరిస్తాయి. థ్యాంక్స్ టు కేసీఆర్’ అని పోస్ట్ చేశారు. తమిళనాడు 25.33 శాతం, కర్ణాటక 25.32 శాతం, ఒడిశా 22.99 శాతం, ఛత్తీస్గఢ్ 22.14 శాతంతో టాప్-5 రాష్ర్టాల్లో నిలిచాయి.