Tomato | ప్రతి వంటింట్లో రుచికరమైన వంటలు వండాలంటే తప్పనిసరిగా ఉల్లిపాయ, టమాటా ఉండాల్సిందే. ఈ రెండింటిలో ఏ ఒక్కటి లేకపోయినా రుచి అంతగా ఉండదు. అందుకే మార్కెట్లో ఉల్లి, టమాటాకు ఎల్లప్పుడూ డిమాండ్ ఉంటుంది. ఈ క్రమంలో ఈ రెండింటి ధరలు పెరగడం సర్వసాధారణమే. అయితే ఉల్లి రేటు దాదాపు కిలో రూ. 100 దాకా చేరిన రోజులున్నాయి. ఆ రేటును ఇప్పుడు టమాటా అధిగమించింది. ప్రస్తుతం కిలో టమాటా ధర మార్కెట్లో రూ. 100 పైనే పలుకుతోంది. ఈ ధర గత మూడు, నాలుగు వారాల నుంచి క్రమక్రమంగా పెరుగుతోంది. టమాటా ధరల పెరుగుదలకు ప్రధానంగా రెండు కారణాలు ఉన్నాయని రైతులు, వ్యాపారులు చెబుతున్నారు. అవేంటంటే.. ఒకటి రాష్ట్రంలో ఎండలు మండిపోవడం, రెండోది ఇంధన ధరలు అమాంతం పెరగడం అని పేర్కొంటున్నారు.
ఈ సందర్భంగా ఓ ఉద్యానవన అధికారి మాట్లాడుతూ.. ఎండలు మండిపోవడం, ప్రతికూల పరిస్థితుల వల్ల మే నెలలో టమాటా పంట దెబ్బతినే అవకాశం ఉంది. ఎన్నో వినూత్న పద్ధతులను ఉపయోగించినప్పటికీ, అధికంగా టమాటాను ఉత్పత్తి చేయలేకపోతున్నట్లు పేర్కొన్నారు. వాతావరణ పరిస్థితులు కూడా టమాటా పంటకు తీవ్ర నష్టం కలిగించాయన్నారు.
రాష్ట్రంలో టమాట దిగుబడి ఆశించిన స్థాయిలో లేకపోవడంతో.. ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకుంటున్నట్లు వ్యాపారులు తెలిపారు. ఉత్తరప్రదేశ్, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ నుంచి 70 శాతం టమాటా దిగుమతి అవుతుందన్నారు. రాష్ట్రంలో కేవలం 30 శాతం టమాటా మాత్రమే దిగుబడి అవుతుందని పేర్కొన్నారు. అయితే ఇతర రాష్ట్రాల నుంచి టమాటాను రవాణా చేయడం భారంగా మారిందన్నారు. పెరిగిన ఇంధనం ధరల కారణంగా, రవాణాపై భారం పడటంతో టమాటాపై రేట్లు పెంచక తప్పని పరిస్థితి ఏర్పడిందన్నారు.
గురువారం నాడు శంషాబాద్ మార్కెట్లో 25 కేజీల టమాటా బాక్స్ రూ. 1800 దాకా అమ్ముడుపోయింది. అంటే కిలో టమాటా ధర రూ. 45 దాకా పడుతోంది. కానీ విక్రయదారులకు మాత్రం కిలో టమాటాను రూ. 80 నుంచి దాకా అమ్ముతున్నారు. టమాటా ధరలు భారీగా పెరిగిపోవడంతో.. దాని వైపు చూసేందుకే గృహిణులు ఇష్ట పడటం లేదు.