హైదరాబాద్, ఏప్రిల్ 1 (నమస్తే తెలంగాణ): జాతీయ రహదారులపై కేంద్రప్రభుత్వం పెంచిన టోల్చార్జీలు శుక్రవారం అర్ధరాత్రి నుంచి అమల్లోకి వచ్చాయి. జాతీయ రహదారులపై తిరిగే అన్ని రకాల వాహనాల (బైక్ మినహా) టారిఫ్ను రూ.10 నుంచి రూ.60 వరకు పెంచారు. కేంద్రప్రభుత్వం పెంచిన టోల్చార్జీల ప్రభావం ఆర్టీసీపై పడకుండా రాష్ట్ర ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టింది. టికెట్ చార్జీలను పెంచకుండా, కేవలం పెరిగిన టోల్చార్జీలను మాత్రమే ప్రయాణికుల నుంచి వసూలు చేస్తున్నది. పెరిగిన టోల్చార్జీలతో ప్రతిరోజు ఆర్టీసీపై రూ.3 నుంచి రూ.3.50 లక్షలు అదనంగా భారం పడుతుంది. ఇప్పుడిప్పుడే గాడినపడుతున్న ఆర్టీసీ ఈ భారాన్ని భరించే పరిస్థితి లేకపోవడంతో ఈ చార్జీలను ప్రయాణికుల నుంచి సేకరిస్తున్నది. ఈ మేరకు శుక్రవారం అర్ధరాత్రి నుంచి టికెట్ ఇష్యూ మిషన్ (టిమ్)లో సర్దుబాటు చేసింది. హైదరాబాద్ నుంచి ఇతర జిల్లాలకు వెళ్లే క్రమంలో గరిష్ఠంగా మూడు టోల్గేట్లు ఉన్నాయి. హైదరాబాద్ నుంచి విజయవాడకు బస్సుల్లో వెళ్లే ప్రయాణికులపై రూ.20, కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, నల్లగొండ, మహబూబ్నగర్, గుంటూరు జిల్లాలకు రూ.10 వరకు చార్జీలు పెరిగాయి.