హైదరాబాద్, ఆగస్టు 14 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు చదవటం, రాయటంలో మెరుగైన శిక్షణ ఇచ్చేందుకు రూపొందించిన ‘తొలిమెట్టు’ కార్యక్రమం సోమవారం నుంచి ప్రారంభమవుతున్నది. కరోనా కారణంగా పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు పడిపోయాయి. విద్యార్థులను తిరిగి గాడిలో పెట్టేందుకు తొలిమెట్టుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. 140 రోజులపాటు 23 వేల బడుల్లో తొలిమెట్టు నిర్వహిస్తారు. 11.24 లక్షల మంది విద్యార్థులు చదవడం, రాయడంలో కనీస సామర్థ్యాలు సాధించేలా శిక్షణ ఇస్తారు.
ఈ కార్యక్రమం కోసం ఇప్పటికే 52,708 మంది టీచర్లకు ప్రభుత్వం శిక్షణ ఇచ్చింది. తొలిమెట్టు కరదీపికను అధికారులు సిద్ధంచేశారు. తరగతులవారీగా ఏయే లక్ష్యాలను సాధించాలో ఇప్పటికే నిర్ధారించి, అందుకు తీసుకోవాల్సిన చర్యలను సైతం సూచించారు. తొలిమెట్టు కార్యక్రమ పర్యవేక్షణకు మండలానికో నోడల్ అధికారిని విద్యాశాఖ నియమించింది. వీరితోపాటు క్లస్టర్ హెచ్ఎంలను తొలిమెట్టు క్లస్టర్ కో ఆర్డినేటర్లుగా నియమించారు. వీరంతా వారానికి రెండు స్కూళ్లను సందర్శించి సమీక్షలు నిర్వహించాలి. అవసరమైతే విద్యార్థులకు పరీక్షలు పెట్టాలి. విద్యార్థులు ప్రగతిని నమోదుచేసేందుకు మొబైల్ యాప్ను సైతం సిద్ధం చేస్తున్నారు.