హైదరాబాద్, జూన్ 28 (నమస్తే తెలంగాణ): నైరుతి రుతుపవాల ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో కరీంనగర్ మినహా అన్ని జిల్లాల్లో వర్షాలు కురిసినట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. సంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో భారీ వర్షాలు కురిసినట్టు పేర్కొన్నది. బుధ, గురువారాల్లో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా జూలై 2 వరకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని పేర్కొన్నది.
బుధవారం ఉదయం వరకు మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సంగారెడ్డి, వికారాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, యాదాద్రి భువనగిరి, సూర్యాపేట, నాగర్కర్నూల్, వనపర్తి, జోగులాంబ గద్వాల, నిజామాబాద్, కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల, మెదక్, మహబూబ్నగర్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, నారాయణపేట జిల్లాల్లో భారీవర్షాలు కురిసే అవకాశం ఉన్నదని తెలిపింది.