KTR Birthday | ఆయన ఆలోచనలు నవీనం.. ఆచరణ వినూత్నం.. అధునాతన టెక్నాలజీపై పరిజ్ఞానం అచంచలం. అభివృద్ధిలో అడుగులు విప్లవాత్మకం. తన గడ్డకు ప్రపంచ దిగ్గజ కంపెనీలను రప్పించడంలో ఎదురులేని చాణక్యం. ప్రజా సమస్యలను ఆకలింపు చేసుకొని పరిష్కార మార్గాలు చూపడంలో విశేష నైపుణ్యం. సేవాతత్పరతకు నిలువెత్తు నిదర్శనం.. చేపట్టిన పదవులకు సంపూర్ణ న్యాయం. లోకల్ టు గ్లోబల్ ఏ విషయమైనా వేగంగా స్పందించే గుణం. యువత భవిష్యత్తుకు ‘తారక’మంత్రం.. నవ్యతకు నిలువుటద్దం.. మోడ్రన్ టెక్నాలజీ సారథి.. ఐటీకి వారధి మంత్రి కల్వకుంట్ల తారకరామారావు. తండ్రి సీఎం కేసీఆర్కి తగ్గ తనయుడిగా నేటి రాజకీయాల్లో తనదైన ముద్ర వేస్తూ ముందుకుసాగుతున్న పర్ఫెక్ట్ లీడర్.ఆయన జన్మదినం సందర్భంగా ‘నమస్తే తెలంగాణ’ ప్రత్యేక కథనం.
హైదరాబాద్, జూలై 23 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాజకీయాల్లో మంత్రి కేటీఆర్ది ఓ ప్రత్యేక స్థానం. మలిదశ ఉద్యమం నుంచి పుట్టుకొచ్చిన అసలుసిసలు తెలంగాణవాది ఆయన. ఉద్యమంలో పాల్గొనేందుకు అమెరికాలో చేస్తున్న ఉద్యోగాన్ని వదిలి 2004 నుంచి పరోక్ష రాజకీయాల్లోకి వచ్చారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో సీఎం కేసీఆర్ అడుగుజాడల్లో నడుస్తూ మడమతిప్పని పోరాటం చేశారు. 2009లో తొలిసారి సిరిసిల్ల నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. తెలంగాణ కోసం తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేందుకు వెనుకాడలేదు. తిరిగి 2010 ఉప ఎన్నికల్లో అదే నియోజకవర్గం నుంచి భారీ మెజార్టీతో గెలుపొందారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సిద్ధించాక 2014 నుంచి ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖ మంత్రిగా తనదైన శైలిలో బాధ్యతలు నిర్విర్తిస్తున్నారు. 2018లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా బాధ్యతలు చేపట్టి పార్టీని ప్రజలకు చేరువ చేయడంతోపాటు నాయకులు, కార్యకర్తలను సమన్వయం చేసుకొంటూ ముందుకుసాగుతున్నారు.
కేటీఆర్ పుట్టినరోజంటే.. ‘గిఫ్ట్ ఏ స్మైల్’
ప్రముఖులు, ముఖ్య నాయకుల జన్మదిన వేడుకలంటే సహజంగా అట్టహాసంగా జరుపుకొంటారు. కానీ, మంత్రి కేటీఆర్ మాత్రం అందుకు విభిన్నం. ప్రచార ఆర్భాటాలకయ్యే ఖర్చులు అభాగ్యులు, అసహాయులు, నిరుపేదల అభ్యున్నతి కోసం వెచ్చించాలని కార్యకర్తలకు తరుచూ చెప్తుంటారు. ఒకసారి తన బర్త్డేకి మొక్కలను నాటాలని, మరోసారి ‘గిఫ్ట్ ఏ స్మైల్’కు పిలుపునిస్తారు. ఇప్పటికీ ‘గిఫ్ట్ ఏ స్మైల్’ పేరిట ప్రతి ఏటా ఆయన మిత్రులు, శ్రేయోభిలాషులు, అభిమానులు పెద్దసంఖ్యలో సామాజిక సేవలో పాలుపంచుకొంటున్నారు. కేటీఆర్ నిర్ణయంతో ఎంతో మంది దివ్యాంగులకు వీల్చైర్స్తోపాటు ఉపకరణాలు, వైద్యశాలలకు అంబులెన్స్లు సమకూరాయి.
మంత్రి కేటీఆర్ ఆలోచనలు ఎప్పుడూ వినూత్నంగానే ఉంటాయి. సామాజిక సమస్యలను అర్థం చేసుకోవడంతోపాటు వాటికి తగిన పరిష్కార మార్గాలను అన్వేషిస్తుంటారు. మంత్రి కేటీఆర్ ఆలోచనలతో పురుడుపోసుకున్న ఆవిష్కరణలు ఎన్నో. అందుకు హైదరాబాద్లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్లో డాక్టర్ సైరస్ పూనావాలా ఇన్ఫెక్షియస్ డిసీజెస్ అండ్ పాండమిక్ ప్రిపేర్డ్నెస్ సెంటర్ నిదర్శనం. 2022 మేలో దావోస్లో నిర్వహించిన వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్నకు మంత్రి కేటీఆర్ హాజరైన సందర్భంలో సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్ఐఐ) సీఈవో అధర్ పూనావాలాతో భేటీ అయ్యారు. అంటువ్యాధులను ఎదుర్కొనేందుకు అవసరమైన నైపుణ్య శిక్షణకు ప్రత్యేకంగా సెంటర్ ఏర్పాటు చేయాలని కేటీఆర్ ప్రతిపాదించారు. ఎస్ఐఐ సీఈవో హామీ ఇవ్వగా, అందుకు సంబంధించిన సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాకు చెందిన విల్లూ పూనావాలా ఫౌండేషన్ (పీవీఎఫ్), పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా (పీహెచ్ఎఫ్ఐ) ఇటీవలే ఒప్పందం చేసుకొన్నాయి. బయో ఏషియా సదస్సుల నిర్వహణలోను తనదైన ముద్ర వేసుకొన్నారు. విదేశీ పర్యటనలు చేపట్టి మరీ.. ప్రపంచ దిగ్గజ కంపెనీలైన గూగుల్, అమెజాన్, ఫాక్స్కాన్తోపాటు మరెన్నో సంస్థలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టేలా ఒప్పించారు. విదేశీ కంపెనీలను తెలంగాణకు రప్పించేందుకు శ్రమిస్తున్నారు. హైదరాబాద్లో డబుల్ డెక్కర్ బస్సులను పునరుద్ధరించి భాగ్యనగర వైభవాన్ని చాటారు.
ప్రజాపాలనలోనూ విప్లవాత్మకం
మంత్రి కేటీఆర్ సామాజికంగానే కాకుండా ప్రజాపాలనలోనూ కూడా తన ప్రత్యేకతను చాటుకొంటున్నారు. సీఎం కేసీఆర్ మిషన్ భగీరథ పథకాన్ని రూపొందించగా, దానిని విజయవంతంగా అమలు చేయడంలో కీలకభూమిక పోషించారు. ఐటీ, మున్సిపల్, పురపాలకశాఖల్లోనూ దశాబ్దాల నాటి సమస్యలను కూడా పరిష్కరించే రీతిలో అనేక సంస్కరణలకు పాదులు వేశారు. వరదల నివారణకు చేపట్టిన స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్, ట్రాఫిక్ నివారణకు చేపట్టిన స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్, నగరవాసుల కోసం ఓపెన్ జిమ్లు, అర్బన్ పార్క్లు ఇలా ఎన్నో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారు. ‘మన ఊరు మన బడి’ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి ఏండ్ల ముందుగానే సీఎస్ఆర్ నిధులతో తన నియోజకవర్గంలోని అనేక పాఠశాలలను మంత్రి కేటీఆర్ ఆధునికీకరించడం విశేషం. ఇటీవల తన నానమ్మ జ్ఞాపకార్థం కామారెడ్డి జిల్లాలోని పోసానిపేటలో రూ. 2.5కోట్లతో అత్యాధునిక వసతులతో బడిని నిర్మించి, గిఫ్ట్గా ఇచ్చారు.
సామాజిక మాధ్యమాల్లో మంత్రి కేటీఆర్ చురుగ్గా ఉంటారు. ఇతర రాజకీయనేతలందరి కంటే భిన్నంగా, పూర్తిగా పాజిటివ్ ధృక్పథంలోనే సోషల్ మీడియాను వినియోగిస్తూ తన ప్రత్యేకతను చాటుకుంటున్నారు. ప్రభుత్వం సాధించిన విజయాలు, తన పర్యటనల విశేషాలు పంచుకొంటారు. ప్రజా సమస్యలను తెలుసుకొనేందుకు, ప్రజలతో తన భావాలను పంచుకొనే వేదికగానే ట్విట్టర్ను వినియోగిస్తుంటారు. ‘ఆస్క్ కేటీఆర్’ హ్యాష్ట్యాగ్తో ప్రజలను నుంచి సమస్యలను తానే స్వయంగా తెలుసుకుంటుండడం విశేషం. ఉర్దూ, ఇంగ్లిష్, హిందీ, తెలుగులో అనర్గళంగా మాట్లాడడమేగాక స్వయంగా ఆయనే ట్వీట్ చేస్తుంటారు. ఆయా భాషల్లో కవితలను కోట్ చేస్తూ దేశంలో జరిగే పరిణామాలపై సమయస్ఫూర్తిగా స్పందిస్తుంటారు. పాజిటివ్ దృక్కోణంలోనే విమర్శలను కూడా గుప్పించడం కేటీఆర్ ప్రత్యేకత. మంత్రి కేటీఆర్కు ట్విట్టర్లో 40.52 లక్షలు, ఫేస్బుక్లో 11.11 లక్షలు, ఇన్స్టాగ్రామ్లో 13.77 లక్షలు, లింక్డిన్లో 2.55 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారంటే ఆయన క్రేజ్ను అర్థం చేసుకోవచ్చు.
ఐటీశాఖ మంత్రి కే తారకరామారావు జన్మదినోత్సవం సందర్భంగా పలువురు వినూత్న రీతిలో శుభాకాంక్షలు తెలిపారు. ప్రజానేత, మంత్రి కేటీఆర్ దేశానికి నాయకత్వం వహించే దిశగా ఎదగాలని పోలీసు హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ ఆకాంక్షించారు. కేటీఆర్ జన్మదినోత్సవం సందర్భంగా కోలేటి శుభాకాంక్షలు తెలిపారు. గిఫ్ట్ ఏ స్మైల్లో భాగంగా పేదరికంతో చదువుకు ఇబ్బందులు పడుతున్న ఇద్దరు విద్యార్థినులకు టీఎస్ ఫుడ్స్ చైర్మన్ మేడే రాజీవ్సాగర్ ఆర్థిక సాయం అందజేశారు. ఎంజీ యూనివర్సిటీలో ఎమ్మెస్సీ ఇంటిగ్రేటెడ్ కెమిస్ట్రీ చదువుతున్న కొమ్ము కిష్టయ్య కుమార్తె సుమతికి, మీర్పేట్ టీకేఆర్ ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ చదువుతున్న మల్లెపాక రాములు కుమార్తె శ్వేత కాలేజీ ఫీజుల కోసం కాలేజీ చదువు పూర్తయ్యే వరకూ రూ.లక్ష చొప్పున అందజేస్తానని ప్రకటించారు. నవతరం నాయకుడు, యువతరం ఆదర్శనీయుడు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ అని టీఎస్ఐఐసీ చైర్మన్ గ్యాదరి బాలమల్లు పేర్కొన్నారు.
మంత్రి కేటీఆర్ జన్మదినోత్సవం సందర్భంగా తెలంగాణ భవన్లో కేసీఆర్ సేవాదళ్ రాష్ట్ర అధ్యక్షుడు మహ్మద్ అమీర్ ఆధ్వర్యంలో రూపొందించిన ప్రత్యేక పాటల సీడీని ఆయన ఆవిష్కరించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ ఎం శ్రీనివాస్రెడ్డి, పౌర సరఫరాల సంస్థ మాజీ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ దేశానికి అభివృద్ధి నమూనా కావాలన్న కలను సాకారం చేస్తున్న కేటీఆర్ వందేండ్లు జీవించాలని అధికార భాషా సంఘం అధ్యక్షుడు జూలూరు గౌరీశంకర్ ఆకాంక్షించారు. మంత్రి కేటీఆర్ జన్మదినోత్సవం సందర్భంగా జూలూరు శుభాకాంక్షలు తెలిపారు.మంత్రి కేటీఆర్ పుట్టిన రోజును పురస్కరించుకొని ఎంపీ సంతోష్కుమార్ గ్రీన్ ఛాలెంజ్లో భాగంగా ఆదివారం ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ముక్రా(కే)లో రెండు వేల మొక్కలు నాటారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి మండలం నాగారం గ్రామస్థులు పొలంలో వరితో హ్యాపీ బర్త్డే కేటీఆర్ అని ఏర్పాటుచేసి, అక్కడే కేక్ కట్ చేశారు.
ఆపద్బాంధవుడు కేటీఆర్
అభాగ్యులకు అండగా నిలువడంలో మంత్రి కేటీఆర్ ముందు వరుసలో ఉంటారు. అటెండర్ నుంచి అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఎదిగిన సిరిసిల్ల జిల్లా చీకోడుకు చెందిన పిట్ల నర్సింహులు, ఇంటి కలను సాకారం చేసుకొన్న తంగళ్లపల్లి మండలం రామచంద్రాపూర్కు చెందిన మేడిపల్లి నీలవ్వ, ఐదో అంతర్జాతీయ నేపాల్ గేమ్స్లో స్వర్ణం సాధించిన యువ కరాటే ప్లేయర్ జనగామ జిల్లా బచ్చన్నపేటకు చెందిన బొలుగుల చందు, కృత్రిమ కాలును అమర్చుకొన్న బీహార్ రాష్ట్రం సీవాన్కు చెందిన దివ్యాంగురాలు ప్రియాంశు కుమారి జీవితాలే కేటీఆర్ మానవీయతకు నిదర్శనాలు.
సమైక్య రాష్ట్రంలో ఉరిసిల్లగా మారిన సిరిసిల్ల మంత్రి కేటీఆర్ చొరవతో సిరుల ఖిల్లాగా మారిపోయింది. బతుకమ్మ చీరలు.. చేనేత లక్ష్మి.. నూలు సబ్సిడీ.. చేనేత కార్మికులకు 50 ఏండ్లకే పింఛన్లాంటి వినూత్న కార్యక్రమాలతో ఉరిసిల్లను ‘సిరి’సిల్లగా మార్చేశారు. చేనేత వస్ర్తాలకు ఆదరణ కల్పించేందుకు కేటీఆరే బ్రాండ్ అంబాసిడర్గా మారిపోయారు. ప్రతి సోమవారం అందరూ చేనేత దుస్తులే ధరించాలని పిలుపునివ్వడమేకాకుండా ఆయన కూడా చే‘నేత’ బట్టల్లో తళుక్కుమంటున్నారు. కేటీఆర్ను స్ఫూర్తిగా తీసుకొని కలెక్టర్లు, సినీతారలు కూడా చేనేత దుస్తులు ధరించి, నేతన్నలకు అండగా నిలుస్తున్నారు.
యూత్లో క్రేజీస్టార్..
రాష్ట్రంలోని యువతకు కేటీఆర్ ఓ క్రేజీస్టార్. సినీతారలకు సరిసమానంగా ఆయనకు యూత్లో క్రేజ్ ఉండడం విశేషం.ఆయన యువతరంలో స్ఫూర్తి నింపే కార్యక్రమాలను చేపడుతుంటారు. యువత అభిలాషకు అనుగుణంగా కొత్త వేదికలకు నాంది పలుకుతుంటారు. ఐటీ హబ్,వీ హబ్, టీ టాస్క్లాంటి ప్రపంచానికే ఆదర్శనీయమైన సంస్థలే ఇందుకు నిదర్శనం. తాను నేర్చుకొన్న, తెలుసుకొన్న కొత్త టెక్నాలజీని యువతతో పంచుకొంటుంటారు. సమాజానికి స్ఫూర్తినిచ్చే, సామాజిక సందేశాన్నిచ్చే సినిమాల ప్రమోషన్ కార్యక్రమాల్లోనూ తళుక్కుమని, ప్రజలకు మంచి సందేశాలు చేరేలా చూస్తుంటారు.
కార్యకర్తలకు అండగా
మంత్రి కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గానే గాకుండా వ్యక్తిగతంగానూ పార్టీ కార్యకర్తలకు అన్నివేళలా చేదోడు వాదోడుగా నిలుస్తుంటారు. తన మార్క్ పంచ్ డైలాగ్లతో పార్టీ కార్యక్రమాల్లో యువ నాయకుల్లో జోష్ నింపుతుంటారు. కరోనా, హైదరాబాద్లో వరదల సందర్భంగా కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తూ సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకొనేలా చేశారు. కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకోవడంలో, కార్యకర్తల కుటుంబాలను ఆదుకోవడంలోనూ ఆయన ముందుంటారు. ఇటీవల హఠాన్మరణం పొందిన ములుగు జడ్పీటీసీ కుసుమ జగదీశ్, సాయిచంద్ కుటుంబాలను అందుకొనేందుకు ప్రత్యేక చొరవ చూపారు.