హైదరాబాద్, నవంబర్ 10 (నమస్తే తెలంగాణ) : గిరిజన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల ఆత్మీయ సమ్మేళనం శనివారం నిర్వహిస్తున్నట్టు బీఆర్ఎస్ ఎస్సీ సెల్ కన్వీనర్ ఎల్ రూప్సింగ్ తెలిపారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా శామీర్పేట మండలం, అంతైపల్లిలోని ఎన్ఎన్ఆర్ పుష్ప కన్వెన్షన్లో జరిగే ఈ ఆత్మీయ సమ్మేళనానికి మంత్రులు కేటీఆర్, హరీశ్రావు, సత్యవతి రాథోడ్ హాజరవుతారని చెప్పారు. ఎన్నో ఏండ్ల నాటి గిరిజనుల ఆకాంక్షలను నెరవేర్చిన సీఎం కేసీఆర్కు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తామని పేర్కొన్నారు. గతంలో ‘మా తండాలో-మారాజ్యం, మావనాటే-మావరాజ్’ పేరుతో సుదీర్ఘ పోరాటాలు చేసినా ఏ ఒక్క నాయకుడు తమ పట్ల కనికరం చూపలేదని రూప్సింగ్ ఆవేదన వ్యక్తంచేశారు. స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ దార్శనికతతో తండాలను గ్రామపంచాయతీలుగా చేయడంవల్ల 3,146 మంది బంజారా, ఆదివాసీ బిడ్డలు సర్పంచ్లుగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారని తెలిపారు. హైదరాబాద్ బంజారాహిల్స్లో సేవాలాల్ బంజారా భవన్, ఆదివాసీ కుమ్రంంభీం ఆత్మ గౌరవ భవనాలు రూ.50 కోట్లతో నిర్మించారని, వీటితోపాటు ప్రతి జిల్లాలో రూ. కోటి వ్యయంతో 32 భవనాలు కట్టించారని చెప్పారు. 1,51,146 బంజారా, ఆదివాసీ గిరిజన కుటుంబాలకు 4,06,369 ఎకరాలకు పోడు పట్టాలు అందించిన మహానేత సీఎం కేసీఆర్ అని కొనియాడారు. ఈ సమ్మేళనానికి గిరిజన ప్రజాప్రతినిధులంతా భారీగా హాజరై, విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.