హైదరాబాద్, జూన్ 12 (నమస్తే తెలంగాణ): దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నేడు రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ మహిళా సంక్షేమ దినోత్సవం నిర్వహించనున్నారు. హైదరాబాద్ సహా జిల్లా, నియోజకవర్గ కేంద్రాల్లో నిర్వహించే కార్యక్రమాల్లో అంగన్వాడీ టీచర్లు, సెర్ప్ సిబ్బంది సహా వెయ్యిమందికి తగ్గకుండా పాల్గొనేలా చర్యలు చేపట్టారు. మహిళా ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొనేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్లను ప్రభుత్వం ఆదేశించింది. హైదరాబాద్లోని రవీంద్రభారతిలో సాయంత్రం 5 గంటలకు వేడుకలు ప్రారంభమవుతాయి. మంత్రులు సత్యవతి రాథోడ్, సబితా ఇంద్రారెడ్డి, మహమూద్ అలీ, తలసాని, మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతాలక్ష్మారెడ్డి, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి తదితరులు పాల్గొంటారు.