గోదావరిఖని, డిసెంబర్ 22: సిరులవేణి సింగరేణి.. ఊహకందని ప్రగతి సాధిస్తున్నది. సమైక్య రాష్ట్రంలో చిక్కి శల్యమైన సంస్థ, స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవతో పునర్జీవం పోసుకొని రాష్ర్టానికే మణిహారంగా నిలుస్తున్నది. విస్తరణలోనూ కీలక అడుగులు వేస్తూ ఇతర రాష్ర్టాల్లోని గనులను దక్కించుకున్న ‘సింగరేణి’ గురువారం 101వ ఆవిర్భావ వేడుకలకు ముస్తాబైంది. తెలంగాణ మణిహారంగా ఉన్న సింగరేణి సంస్థ ఏటా రికార్డు స్థాయి అభివృద్ధితో ముందుకు సాగుతున్నది. కార్మికులకు ఆర్థిక ప్రయోజనాలు, లాభాల్లో వాటా, కారుణ్య నియామకాలు.. ఇలా అనేక కార్యక్రమాలతో ముందుకెళ్తూ తిరుగులేని శక్తిగా ఎదుగుతున్నది. 49 శాతం వాటా కలిగిన కేంద్రం.. సింగరేణి నుంచి వచ్చే డివిడెంట్లు, పన్నులు తీసుకొంటూ.. ఏమాత్రం సహకరించకపోయినా ఏడున్నరేండ్లలోనే రెట్టించిన అభివృద్ధి సాధించింది. కార్మికులకు ఆదాయపన్ను రద్దు చేయాలని అసెంబ్లీలో తీర్మానం చేసి పంపినా ఇంకా నిర్ణయం తీసుకోని కేంద్ర సర్కారు.. నేడు సింగరేణి సంస్థకు చెందిన 4 బొగ్గు బ్లాకులను సంస్థకు చెందకుండా వేలం ద్వారా అమ్మేసే చర్యలకు పూనుకోవడంపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతున్నది.