హైదరాబాద్, సెప్టెంబర్ 16 (నమస్తే తెలంగాణ): తెలంగాణ సమైక్యతా దినోత్సవం సందర్భంగా శనివారం రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాల్లో జాతీయ జెండాలను ఎగురవేయనున్నారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్లోని పబ్లిక్ గార్డెన్స్లో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు జాతీయ జెండాను ఎగురవేస్తారు. అలాగే అన్ని జిల్లాల్లో నిర్ణయించిన డిజిగ్నేటరీ ప్రజాప్రతినిధులు, ముఖ్యులు జాతీయ జెండాను ఎగురవేస్తారు.
ఈ మేరకు ప్రభుత్వం ఇప్పటికే ఏ జిల్లాలో ఎవరు జాతీయ జెండాను ఎగురవేయాలో నిర్ణయించింది. జాతీయ సమైక్యతా దినోత్సవం సందర్భంగా శనివారం ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ, ప్రైవేట్ ఎయిడెడ్ విద్యాసంస్థలన్నింటికీ రాష్ట్ర ప్రభుత్వం సెలవు ప్రకటించింది. అయినప్పటికీ అన్ని విద్యా సంస్థల్లో జాతీయ పతాకాలు ఆవిష్కరించాలని సీఎస్ సూచించారు. పబ్లిక్ గార్డెన్లో జరిగే వేడుకలకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.
ఆ తరువాత సీఎం కేసీఆర్ బంజరాహిల్స్లోనిర్మించిన ఆదివాసీ, బంజారా భవన్లను ప్రారంభిస్తారు. అనంతరం ఇందిరా పార్క్ ఎదురుగా ఉన్న ఎన్టీఆర్ స్టేడియంలో జరిగే ఆదివాసీ, గిరిజన బహిరంగ సభలో సీఎం కేసీఆర్ పాల్గొంటారు. ఈ బహిరంగ సభకు రాష్ట్రం నలుమూలల నుంచి 1.20 లక్షల మంది ఆదివాసీ, గిరిజన ప్రజలు హాజరు కానున్నారు.
ఆదివాసీ, బంజారా భవనాల ప్రారంభోత్సవం సందర్భంగా సీఎం కేసీఆర్ రాష్ట్రంలోని ప్రముఖ ఆదివాసీ, బంజారా కళాకారులు, ప్రతినిధులను సన్మానించనున్నారు. ఇందులో పద్మశ్రీ అవార్డు గ్రహీతలు కనకరాజు, సకిని రామచంద్రయ్యను ఘనంగా సత్కరించనున్నారు. ఇప్పటికే ప్రభుత్వం వీరిద్దరికి రూ.కోటి చొప్పున నగదు పారితోషికం ప్రకటించింది. వీరికి శనివారం చెక్కులను అందజేయనున్నారు. అనంతరం గిరిజన విద్యార్థులతో సీఎం కేసీఆర్ సంభాషించనున్నారు.
తెలంగాణ సమైక్యతా దినోత్సవాల సందర్బంగా శనివారం పీపుల్స్ ప్లాజా నుంచి ఐమాక్స్ క్రాస్రోడ్, లుంబినీపార్క్, అంబేద్కర్ విగ్రహం, ఇందిరాపార్క్ల మీదుగా ఎన్టీఆర్ స్టేడియం వరకు నాలుగు కిలోమీటర్ల దూరం 5 వేల మంది కళాకారులతో సాంస్కృతిక జైత్రయాత్ర నిర్వహిస్తున్నారు. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ఆదేశాల మేరకు మంత్రి శ్రీనివాస్గౌడ్ పర్యవేక్షణలో ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్టు సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ తెలిపారు. రాష్ట్రం నలుమూలల నుంచి 33 జిల్లాలకు చెందిన కళాకారులు ఈ సాంస్కృతిక జైత్రయాత్రలో పాల్గొంటున్నారని చ్పెరు. ఈ జైత్రయాత్రలో కళాకారులు సాంప్రదాయ వస్ర్తధారణ, వాద్యాలతో పరేడ్లా వస్తారని తెలిపారు. ఈ యాత్ర శనివారం ఉదయం 12.30 గంటలకు ప్రారంభమవుతుందని వివరించారు. ఈ కళాకారులందరికీ జలవిహార్లో ఏర్పాట్లు చేశామన్నారు.
ఆదివాసీ నాయకపోడ్, ఆదివాసీ డోళ్లు, బైండ్ల కథ, బంజారా, బతుకమ్మ, బీరప్పడోళ్లు, భజన, భజన కోలాటం, బుర్రకథ, చిందు యక్షగానం, చిరుతల భజన, చిరుతల రామాయణం, డప్పులు, ధింసా, దుబ్బుల కొలుపు, డెంసా డ్యాన్స్, గుజరాతి-గర్భాడ్యాన్స్, గుస్సా డి, జడకొప్పుల కోలాటం, కోలాటం, కొమ్ముబూరలు, కొమ్ముకోయ, మందహెచ్చుల కథలు, మాధురి డాన్స్, నగారా భేరీ, ఒగ్గుడోళ్లు, పొడపత్రపోళ్ల కథలు, పోతరాజు, పంజాబీ-భాంగ్రా డాన్స్, రాజన్న డోళ్లు, రేణుక ఎల్లమ్మ బృందం, శారద కథలు, తాళం భజన కోలాటం, తోలుబొమ్మలాట, వీధిభాగవతం.
బహిరంగ సభ జరిగే ప్రధాన వేదికపై సాంస్కృతిక సారధి కళాకారులు వంద మంది సాంస్కృతిక ప్రదర్శనలు ఇస్తారు. ఈ మేరకు వంద మంది కళాకారులు మూడు రోజులనుంచి లలితకళా తోరణంలో రిహార్సల్స్ చేస్తున్నారు. ఈ కళాబృందాలకు సాంస్కృతిక సారథి చైర్మన్, ఎమ్మెల్యే రసమయి బాలకృష్ణ నేతృత్వం వహిస్తున్నారు. వేదికపై జాతీయ సమైక్యతా స్ఫూర్తిని నింపే విధంగా, మత సామరస్యాన్ని కాపాడే విధంగా కళారూపాల ప్రదర్శన ఉంటుంది.
తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవా న్ని పురసరించుకొని శనివారం సాయంత్రం ఎన్టీఆర్ స్టేడియంలో సీఎం కేసీఆర్ పాల్గొనే బహిరంగ సభ ఏర్పాట్లను శుక్రవారం సాయంత్రం సీఎస్ పరిశీలించారు. అధికారులకు పలు సూచనలు చేశారు. సభ ఏర్పాట్లను పరిశీలించిన వారిలో జీఏడీ కార్యదర్శి శేషాద్రి, ఆరోగ్య, పంచాయితీరాజ్ శాఖ కార్యదర్శి సందీప్కుమార్ సుల్తానియా, కుటుంబ సంక్షే మ శాఖ కార్యదర్శి రిజ్వీ, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ , హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అమయ్కుమార్, హైదరాబాద్ జాయింట్ పోలీస్ కమిషనర్ డీఎస్ హాన్ తదితర ఉన్నతాధికారులు ఉన్నారు.
ఆదివాసీ, బంజారా భవనాల నిర్మాణానికి ప్రభుత్వం దాదాపు రూ.50 కోట్ల నిధులను ఖర్చుచేసింది. జీ ప్లస్ వన్ విధానంలో నిర్మించిన ఈ భవనాల్లో వేర్వేరుగా 1000 మంది కూర్చొనేలా ఆడిటోరియం, 250 మందికి సరిపోయే డైనింగ్ హాల్స్, వీఐపీ లాంజ్లు, ఫొటోగ్రఫీ, కళాకృతులు, పెయింటింగ్స్ వంటి ఏర్పాట్లు చేశారు. రాష్ట్రంలోని గోండు, కోయ, పర్దాన్, థోటి, నాయక్పోడ్, చెంచు ఇలా 10 ఆదివాసీ తెగల సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా ఈ భవనాలు రూపుదిద్దుకొన్నాయి. బంజారా భవన్లో లంబాడీల జీవన విధానం, సంస్కృతిని తెలిపే విధంగా గ్యాలరీలు ఏర్పాటు చేశారు.