( నేడు జ్యోతిబాఫూలే జయంతి సందర్భంగా ప్రత్యేక కథనం )
CM KCR | హైదరాబాద్, ఏప్రిల్ 10 (నమస్తే తెలంగాణ): ‘విద్య లేకపోవడం అజ్ఞానానికి దారితీస్తుంది. అజ్ఞానం ఆర్థికాభివృద్ధిని దెబ్బతీస్తుంది. ఆర్థికలేమి సమాజంలో గుర్తింపును మాయం చేస్తుంది’.. ఇవీ మహాత్మా జ్యోతిబాఫూలే, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చెప్పిన మాటలు. అందుకే ‘అందరికీ అక్షరజ్ఞానం’ నినాదంతో మహాత్మా జ్యోతిరావు గోవిందరావు ఫూలే జీవితాంతం కృషిచేశారు. ముఖ్యంగా మహిళా విద్యాభివృద్ధికి ఎంతో పాటుపడ్డారు. ఫూలే ఆశయాలకు అనుగుణంగా, ఆయన చూపిన బాటలోనే తెలంగాణ సర్కారు ముందుకుసాగుతున్నది. రాష్ట్రంలో ఆడబిడ్డల విద్యాభివృద్ధికి తొలి ప్రాధాన్యం ఇస్తున్నది. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీ వర్గాల్లోని మహిళలను విద్యవైపు మళ్లించేందుకు ప్రణాళికాబద్ధంగా సాగుతున్నది. ఆయా వర్గాల బాలికల కోసం ప్రత్యేకంగా గురుకుల పాఠశాలలతోపాటు ఇంటర్, డిగ్రీ రెసిడెన్షియల్ కళాశాలలను నెలకొల్పింది.
పౌష్ఠికాహారం అందిస్తూ కార్పొరేట్కు దీటుగా నాణ్యమైన విద్యను అందిస్తున్నది. 67.04 శాతం మంది బాలికలు ప్రభుత్వ విద్యాసంస్థల్లోనే విద్యాభ్యాసం కొనసాగించడం ఇందుకు నిదర్శనం. గురుకుల విద్యను అందుబాటులోకి తీసుకురావడంతో ఇంటర్, డిగ్రీ, పీజీ, బీఈడీ తదితర ఉన్నత విద్యా ప్రవేశాల్లో మహిళల సంఖ్య గణనీయంగా పెరిగింది. పీజీ కోర్సుల్లో 72 శాతం, డిగ్రీలో 52 శాతం, బీఈడీ కోర్సుల్లో 81 శాతం అమ్మాయిలే చేరడం ప్రభుత్వ దన్నుతో బాలికలు సాధిస్తున్న పురోగతికి అద్దంపడుతున్నది.
సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్లను ఏర్పాటు చేసి విద్యార్థినులకు ఐఐటీ, జేఈఈ, నీట్తోపాటు జాతీయ, రాష్ట్రస్థాయిలో నిర్వహించే ప్రవేశ పరీక్షలకు ఇంటెన్సివ్ కోచింగ్ను ఉచితంగా అందిస్తున్నది. దీంతో ఎస్సీ, ఎస్టీ, బీసీ గురుకులాల విద్యార్థినులు ఉన్నత విద్యారంగంలోకి ప్రవేశివేస్తున్నారు. జాతీయ, అంతర్జాతీయస్థాయిలో ప్రాచుర్యం పొందిన ఉన్నత విద్యాసంస్థల్లోనూ అడ్మిషన్లు పొందుతున్నారు. దాదాపు 650 మందికిపైగా బాలికలు మెడిసిన్ సీట్లు సంపాదించడం గర్వకారణం. ఇక విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించాలనుకొనే బీసీ యువతులకు ఇతర రాష్ర్టాలు రుణాల కింద నిధులు ఇస్తుండగా, తెలంగాణ సర్కారు మాత్రం ఓవర్సీస్ విద్యానిధి పథకం కింద రూ.20 లక్షల ఆర్థిక సాయాన్ని అందజేస్తున్నది.
తెలంగాణ ప్రభుత్వం బాలికల కోసం పాఠశాలస్థాయి నుంచి డిగ్రీ, పీజీ వరకు ప్రత్యేక గురుకులాలను నెలకొల్పడమే కాదు అందులో విభిన్నమైన, వారి అభిరుచికి, ఉద్యోగావకాశాలను అందిపుచ్చుకొనేందుకు దోహదపడేలా కోర్సులను ప్రవేశపెడుతున్నది. ఇంటర్మీడియట్లో వొకేషనల్లో అగ్రికల్చర్ అండ్ క్రాప్ ప్రొడక్షన్, అకౌంటింగ్, ట్యాక్సేషన్, ఆఫీస్ అసిస్టెంట్షిప్, కంప్యూటర్ గ్రాఫిక్స్ అండ్ యానిమేషన్, హోమ్సైన్స్, కమర్షియల్ గార్మెంట్ టెక్నాలజీ, మల్టీ పర్పస్ హెల్త్ అసిస్టెంట్, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, ఫిజియోథెరపీ, టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ కోర్సులను ప్రవేశపెట్టింది. డిగ్రీస్థాయిలో సైబర్ సెక్యూరిటీ, డాటా సైన్స్, ఏఐ టెక్నాలజీ, బీబీఏ, సైకాలజీ, ఫుడ్ అండ్ న్యూట్రిషన్ అండ్, డైట్, ఫ్యాషన్ డిజైన్ టెక్నాలజీ తదితర అధునాతన, మార్కెట్ డిమాండ్కు అనుగుణమైన కోర్సులను అందుబాటులోకి తీసుకురావడం విశేషం. ప్రత్యేకంగా ఇంటిగ్రేటెడ్ న్యాయకళాశాల, వ్యవసాయ కళాశాలల, నర్సింగ్ కాలేజీలను సైతం ఏర్పాటు చేస్తుండటం అభినందనీయం.
మెరుగైన విద్యను అందించడంతోపాటు ఉద్యోగ, ఉపాధి అవకాశాలపై ప్రత్యేకంగా ఆయా విషయ నిపుణులను తీసుకువచ్చి విద్యార్థినులకు కళాశాల అధ్యాపకులు అవగాహన కల్పిస్తున్నారు. కమ్యూనికేషన్ స్కిల్స్, సాఫ్ట్ స్కిల్స్ తదితర వాటిపై ఉచితంగా శిక్షణ ఇస్తున్నారు. డిగ్రీ మొదటి సంవత్సరం నుంచే పైచదువులకు అనుగుణంగా వివిధ పోటీపరీక్షలకు సంబంధించి శిక్షణ ఇస్తున్నారు. కంప్యూటర్ సైన్స్ విద్యార్థులకు డాటా సైన్స్, జావా తదితర అంశాల్లో తర్ఫీదునిస్తున్నారు. సాయంత్రం వేళ ప్రత్యేకంగా కరెంట్ అఫైర్స్, న్యూమరికల్, మెంటల్ ఎబిలిటీ, స్పోకెన్ ఇంగ్లిష్ తదితర తరగతులను నిర్వహిస్తున్నారు. మాక్ ఇంటర్వ్యూలు, క్విజ్ పోటీలను నిర్వహిస్తూ విద్యార్థులను మెరికలుగా తీర్చిదిద్దుతున్నారు. డిగ్రీ చివరి సంవత్సరం పూర్తి చేసిన విద్యార్థినులకు వేసవి సెలవుల్లోనూ ఉచితంగా శిక్షణ ఇస్తున్నారు. కాగ్నిజెంట్, ఇన్ఫోసిస్లాంటి ప్రముఖ సంస్థలు ప్రాంగణ నియామకాలను నిర్వహిస్తున్నాయి. ఒక్క వర్గల్ బాలికల గురుకుల కాలేజీ నుంచే 2019 నుంచి ఇప్పటివరకూ మొత్తంగా 150 మందికిపైగా విద్యార్థినులు ఉద్యోగాలను సాధించడం విశేషం. స్టడీ సర్కిళ్లలో బాలికలకు వేర్వేరుగా హాస్టల్ వసతులను కల్పిస్తూ పోటీపరీక్షలకు తర్ఫీదునిప్పిస్తున్నది.
మాది ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి. నాన్న దినసరి కూలీ. అమ్మ బీడీ కార్మికురాలు. బెస్ట్ అవైలెబుల్ స్కూల్ కింద ప్రైవేట్ స్కూల్లో చదివా. ఇంటర్, డిగ్రీ బీసీ గురుకులంలో పూర్తిచేశా. గురుకులం లేకుంటే నేను చదువకపోయేదాన్ని. వేసవి సెలవుల్లో కూడా పోటీపరీక్షలకు శిక్షణ ఇచ్చారు. వివిధ అంశాలపై సెమినార్లతోపాటు విషయనిపుణులతో అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తున్నారు. వేసవిలోనూ ప్రత్యేకంగా తరగతులు నిర్వహిస్తున్నారు. ఉద్యోగ, ఉపాధి అవకాశాలను పొందేలా తీర్చిదిద్దుతున్నారు.
– శిల్ప, వర్గల్ గురుకుల్ విద్యార్థిని
మాది మహబూబ్నగర్ జిల్లా హన్వాడ మండలం, వేపూర్ గ్రామం. అమ్మానాన్నలు రాంచంద్రయ్య, వసంత. ఇద్దరూ వ్యవసాయమే చేస్తారు. పదో తరగతి వరకు అక్కడే చదువుకున్న. ఇంటర్ టీఎస్ మోడల్ జూనియర్ కాలేజీ కోస్గిలో పూర్తిచేశా. కానీ డిగ్రీ గురుకులంలో చేరిన తర్వాతే సమాజం గురించి తెలిసింది. ఇక్కడ ఎంతో నేర్చుకొన్న. ప్రస్తుత పోటీ ప్రపంచంలో బహుళ నైపుణ్యాలున్నవారికే ఉద్యోగావకాశాలు ఎక్కువ. అందుకు అనుగుణంగా గురుకులంలో ప్రత్యేకంగా శిక్షణ ఇస్తున్నరు. రోజువారీగా వివిధ అంశాలపై అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయడంతోపాటు మాక్ ఇంటర్వ్యూలను కూడా నిర్వహిస్తూ లోపాలను సరిదిద్దుతున్నారు. అందువల్లే ఇటీవల నిర్వహించిన ప్లేస్మెంట్లలో చక్కని అవకాశాన్ని దక్కించుకున్నా. ఇంత గొప్ప అవకాశాలను కల్పించిన సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు.
– నందిని, వర్గల్ గురుకుల్ కాలేజీ