సిద్దిపేట : వడ్లు కొనమంటే నూకలు తినమని తెలంగాణ ప్రజలను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అవమానిస్తున్నది. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ మనల్ని నూకలు తినమనడం అంటే యావత్తు తెలంగాణ ప్రజలను అవమాన పరచడమేనని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. ఆదివారం గజ్వేల్ మండలం శ్రీగిరిపల్లి గ్రామంలో మంత్రి పర్యటించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఢిల్లీ ప్రభుత్వాన్ని గద్దె దించింతేనె ధరలు తగ్గుతాయన్నారు. నూకలు తినమని అవమాన పరిచిన ఢిల్లీ ప్రభుత్వానికి నూకలు చెల్లెలా రాబోయే ఎన్నికల్లో ప్రజలు తీర్పు ఇవ్వాలని పిలుపునిచ్చారు. పెట్రోల్ డీజిల్, వంట గ్యాస్ పై పెంచిన ధరలను చేతనైతే తగ్గించి బీజీపీ మాట్లాడాలి.
తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే లక్షా 30 వేల పోస్టులను భర్తీ చేసింది. మళ్లీ 90 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వనుందని ఆయన పేర్కొన్నారు. రక్షణ శాఖతో సహా దేశంలోని కేంద్ర ప్రభుత్వ శాఖలలో 15 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. దమ్ముంటే వెంటనే 15 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలని మంత్రి సవాల్ విసిరారు.