హైదరాబాద్ : ఉద్యోగులకు ఒక శాతం చందాతో కూడిన నగదు రహిత ఆరోగ్య పథకాన్ని (ఈహెచ్ఎస్) అమలుచేస్తామని బడ్జెట్లో ప్రకటించడంపై టీఎన్జీవో కేంద్రం సంఘం హర్షం వ్యక్తంచేసింది. ఈ మేరకు మంగళవారం ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీష్రావు, ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావులను వేర్వేరుగా కలిసి కృతజ్ఞతలు తెలిపింది. ఉద్యోగులు, ఉపాధ్యాయ, పెన్షనర్లు ఎంతో కాలంగా వేచిచూస్తున్న నగదు రహిత ఈహెచ్ఎస్ పథకాన్ని ఏర్పాటు చేయడం సంతోషదాయమని, దీంతో రాష్ట్రంలోని 6.5 లక్షల కుటుంబాలకు మేలు జరుగుతుందని టీఎన్జీవో కేంద్రం సంఘం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మామిళ్ల రాజేందర్, రాయకంటి ప్రతాప్ అభిప్రాయపడ్డారు. ఈహెచ్ఎస్ కోసం బడ్జెట్లో రూ.700 కోట్లను ప్రకటించడంపై ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. ఎన్నో ఏండ్లుగా సాధ్యం కానిది.. స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ నాయకత్వంలో సాధించుకోవడం ఉద్యోగులందరికీ గర్వకారణమన్నారు.
పీఆర్సీ సహా ఈహెచ్ఎస్ను ప్రకటించడం ఉద్యోగులకు సీఎం కేసీఆర్కున్న అమితమైన ప్రేమకు నిదర్శనమన్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ ఈహెచ్ఎస్ విజయవంతంగా అమలు చేయడానికి మార్గదర్శకాలు వెంటనే విడుదల చేస్తామని, భారతదేశంలోనే తెలంగాణ ఈహెచ్ఎస్ను గొప్ప పథకంగా అమలుచేద్దామని తమకు చెప్పినట్లు రాజేందర్, ప్రతాప్ తెలిపారు. టీఎన్జీవో అసోసియేట్
అధ్యక్షుడు కస్తూరి వెంకట్, హైదరాబాద్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు, ముజీబ్, విక్రమ్, రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు లక్ష్మణ్, నగరశాఖ అధ్యక్షుడు శ్రీరామ్, సిద్ధిపేట జిల్లాధ్యక్షుడు పరమేశ్వర్, విక్రమ్రెడ్డి మంత్రి హరీశ్రావును కలిసినవారిలో ఉన్నారు.