TSRTC | హైదరాబాద్ : గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ ఆర్టీసీ బిల్లును ఆమోదించకపోతే రాజ్భవన్ను ముట్టడిస్తామని తెలంగాణ మజ్దూర్ యూనియన్(టీఎంయూ) హెచ్చరించింది. ఈ సందర్భంగా టీఎంయూ ప్రధాన కార్యదర్శి థామస్ రెడ్డి మాట్లాడుతూ.. ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేయాలని సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఇటీవల జరిగిన కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఆర్టీసీలో ఉన్న 43,373 మంది కుటుంబాలలో కేసీఆర్ వెలుగులు నింపితే.. గవర్నర్ మాత్రం అంధకారం నింపేందుకు యత్నిస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం ప్రతిపాదించిన ఆర్టీసీ బిల్లును గవర్నర్ ఆమోదించకపోవడం సరికాదన్నారు. ఇది 43 వేల మంది ఆర్టీసీ కార్మికులకు సంబంధించిన సమస్య అని పేర్కొన్నారు.
గవర్నర్ పార్టీ కార్యకర్తగా వ్యవహరిస్తున్నారని థామస్ రెడ్డి మండిపడ్డారు. మా జీవితాలలో వెలుగులు నింపే ఈ బిల్లును వెంటనే ఆమోదించాలన్నారు. లేనిపక్షంలో ఆర్టీసీ కార్మికులంతా నల్ల బ్యాడ్జీలతో నిరసన కార్యక్రమాలను చేపడతాం. అవసరమైతే రాజ్ భవన్ ముట్టడికి కూడా వెనకాడం అని థామస్ రెడ్డి హెచ్చరించారు.
ప్రస్తుతం కొనసాగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో ఆర్టీసీ విలీనం బిల్లు పాస్ చేయాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. కానీ ఆర్టీసీ విలీనం బిల్లుకు రాజ్భవన్ మోకాలడ్డుతోంది. ఈ బిల్లుపై గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ తన అభిప్రాయాన్ని చెప్పలేదు. రెండు రోజుల నుంచి ఆమె నుంచి ఎలాంటి స్పందన లేదు. సాంకేతికంగా మనీ బిల్లు కావడంతో గవర్నర్ కాన్సెంట్ కోసం రాష్ట్ర సర్కార్ పంపింది. అసెంబ్లీ సెషన్ ముగిసేలోగా గవర్నర్ కాన్సెంట్ చెప్పాలి. కానీ.. రెండు రోజులుగా గవర్నర్ స్పందించడం లేదు. గవర్నర్ తీరుపై ఆర్టీసీ కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర సర్కారుపై వ్యతిరేక వైఖరితోనే ఆర్టీసీ బిల్లును గవర్నర్ ఆపుతున్నారని కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆర్టీసీ కార్మికుల్లో అధిక శాతం బడుగు, బలహీన వర్గాలు, పేదలే ఉన్నారు. అలాంటి వారిని ఇబ్బంది పెట్టేలా గవర్నర్ వ్యవస్థ వ్యవహరించడంపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చ కొనసాగుతోంది. అయితే ఈ బిల్లుపై గవర్నర్ న్యాయ సలహా తీసుకుంటారని, కొంత సమయం అవసరమని పేర్కొంటూ రాజ్భవన్ వర్గాలు శుక్రవారం మధ్యాహ్నం ఒక ప్రకటన విడుదల చేశాయి.