మోటకొండూర్, డిసెంబర్ 2 : ఎస్సీ వర్గీకరణ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టి చట్టబద్ధత కల్పిస్తామని చెప్పి మాటతప్పిన బీజేపీకి మాదిగలు తగిన గుణపాఠం చెప్పాలని టీఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ మాదిగ పిలుపునిచ్చారు. బీజేపీ మోసాన్ని ఎండగడుతూ ఈ నెల 19న ఢిల్లీలో నిర్వహించనున్న ‘చలో ఢిల్లీ-మాదిగల లొల్లి’ కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాలను శుక్రవారం ఆయన యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూర్లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వంగపల్లి మాట్లాడుతూ.. ఎస్సీ వర్గీకరణ చేపడుతామని 2014లో బీజేపీ ఎన్నికల మ్యానిఫెస్టోలో ప్రకటించి.. ఐదేండ్లు అధికారంలో ఉన్నా పట్టించుకోలేదని విమర్శించారు. తిరిగి 2018లో అధికారంలోకి వచ్చి నాలుగేండ్లు గడిచినా వర్గీకరణ బిల్లు గురించి ఊసెత్తడం లేదని మండిపడ్డారు. వంద రోజుల హామీని గంగలో కలిపిందని దుయ్యబట్టారు. ‘చలో ఢిల్లీ-మాదిగల లొల్లి’ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వైద్యాఆరోగ్య శాఖ మంత్రి హరీశ్రావు రానున్నారని, మాదిగలు పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు. మాదిగ ప్రజల చిరకాల ఆకాంక్షను నెరవేర్చకుండా, చట్టబద్ధత కల్పించకుండా మోసం చేసిన పార్టీగా బీజేపీ చరిత్రలో నిలుస్తుందన్నారు. తెలంగాణలో బీజేపీ ఎంపీలను మాదిగలు అడుగడుగునా నిలదీయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో టీఎమ్మార్పీఎస్ కోర్ కమిటీ సభ్యుడు చిలకమర్రి గణేశ్, ఎంఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కొల్లూరి వెంకట్, టీఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు కూరెళ్ల రమేశ్ తదితరులు పాల్గొన్నారు.