మహబూబ్నగర్ అర్బన్, జనవరి 11 : దళితబంధు పథకం అద్భుతమని, ఇది దేశానికే ఆదర్శమని టీఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ కొనియాడారు. ఈ పథకాన్ని అమలు చేస్తున్న సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు. బుధవారం మహబూబ్నగర్లోని అరుంధతి భవనంలో రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లెపోగు శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉమ్మడి జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశంలో వంగపల్లి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం దళితులకు అందిస్తున్న రూ.10 లక్షలతో దళితులు ఆర్థికంగా నిలదొక్కుకోవాలని కోరారు. దేశంలోని అన్ని రాష్ర్టాలు తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదర్శంగా తీసుకొని దళితబంధును అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఎస్సీ వర్గీకరణ తదితర సమస్యలపై కేంద్రం తీరును నిరసిస్తూ ఈనెల 14న హైదరాబాద్లోని ఇందిరాపార్కు వద్ద నిర్వహించే ధర్నాలో మాదిగలు పెద్ద ఎత్తున పాల్గొనాలని ఆయన కోరారు.