హైదరాబాద్, మే 29, (నమస్తే తెలంగాణ): హైదరాబాద్లోని టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ (టీఐఎస్ఎస్) ఢిల్లీలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అర్బన్ అఫైర్స్ (ఎన్ఐయూఏ)తో కలిసి ఆదివారం రెండు కొత్త కోర్సులను ఆవిష్కరించింది. ప్లానింగ్, ఇన్స్టిట్యూషన్స్, సిటీ ఫైనాన్సెస్, డాటా అనలిటిక్స్, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ సబ్జెక్టులతో రెండేండ్ల పాటు కొనసాగే ఎంఏ, ఏడాది వ్యవధి కలిగిన పీజీ డిప్లొమా కోర్సులను ప్రారంభించింది. వీటి ఆవిష్కరణ సందర్భంగా ఈ రెండు ప్రతిష్ఠాత్మక సంస్థల డైరెక్టర్లు ప్రొఫెసర్ శాలినీ భరత్ (టీఐఎస్ఎస్), హితేశ్ వైద్య (ఎన్ఐయూఏ) రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్తో సమావేశమై కొత్త కోర్సులపై చర్చించారు. అనంతరం వినోద్కుమార్ మాట్లాడుతూ.. ఎడ్యుకేషనల్ హబ్గా హైదరాబాద్ శరవేగంగా అభివృద్ధి చెందుతున్నదని తెలిపారు. ఈ రెండు కోర్సులు విద్యార్థులకు ఎంతో ఉపయోగపడతాయని, ప్రస్తుతం నగరాలు ఎదుర్కొంటున్న సమకాలీన సమస్యలకు పరిష్కారాలను చూపగలిగేలా వారిని తీర్చిదిద్దుతాయని పేర్కొన్నారు.