యాదాద్రి : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామివారి తిరువీధిసేవ అత్యంత వైభవంగా నిర్వహించారు. బుధవారం స్వామివారిని గరుడ వాహనం, అమ్మవారి తిరుచ్చివాహనంపై వేంచేపు చేసి సేవను కొనసాగించారు. సప్తతల రాజగోపురం గుండా తిరువీధి మాఢవీధులు తిరుగుతూ తూర్పు రాజగోపురం నుంచి ప్రధానాలయంలోకి సేవ సాగింది. దర్బార్ సేవను అర్చకులు అత్యంత వైభవంగా జరిపారు. ప్రధానాలయ ముఖ మండపంలో స్వామి, అమ్మవార్లను దివ్య మనోహరంగా అలంకరించి వేంచేపు చేశారు. నాలుగు వేదాలు స్వామివారికి పారాయణం చేసి, స్వామివారి స్వస్తి మంత్రార్థ వంటి మంత్రాలతో శాంతిపజేస్తారు. అనంతరం స్వామివారిని గర్భాలయానికి వేంచేపు చేశారు. స్వయంభూ నారసింహుడికి స్వామివారికి తులసి సహస్రనామార్చన, అమ్మవారికి కుంకుమార్చన, శ్రీఆంజనేయ స్వామివారికి సహస్రనామార్చన జరిపారు. రాత్రి ప్రధానాలయ ముఖ మండపంలో ప్రతిష్ఠామూర్తులకు ఆరాధన, సహస్రనామార్చన జరిగాయి.
పాతగుట్ట ఆలయంలో స్వామివారి నిత్యోత్సవాలు నిర్వహించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు దర్శనాలు కొనసాగాయి. కార్తిక మాసం సందర్భంగా సత్యనారాయణ వ్రతాలు, కార్తీక దీపారాధనలో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. సుమారు 6 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. శ్రీవారి నిత్యాదాయం రూ. 8,69,244 ఆదాయం సమకూరిందని ఆలయ ఈవో ఎన్ గీత తెలిపారు.
యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి 13 రోజుల హుండీ ఆదాయం బుధవారం లెక్కించారు. రూ.1,20,32,052 నగదు, 113 గ్రాముల మిశ్రమ బంగారం, 2 కిలోల 100 గ్రాముల మిశ్రమ వెండితోపాటు అమెరికా, యూఏఈ, కెన్యా, బింబాబ్వే, ఫ్రాన్స్, వెస్ట్ ఆఫ్రికా, యూరో, కెనడా దేశాలకు చెందిన కరెన్సీ సమకూరిందని ఆలయ ఈవో ఎన్ గీత తెలిపారు.