హైదరాబాద్: ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసింది. 8 వేల మంది పోలీసుల బందోబస్తు విధులు నిర్వహిస్తున్నారు. ముచ్చింతల్లోని శ్రీరామనగరాన్ని పోలీసులు తమ అధీనంలోకి తీసుకున్నారు. అక్కడ ప్రత్యేకంగా కమాండ్ కంట్రోల్ సెంటర్ను ఏర్పాటు చేసి భద్రతను పర్యవేక్షిస్తున్నారు. పర్యవేక్షణ బాధ్యతలను పోలీసు ఉన్నతాధికారులకు డీజీపీ అప్పగించారు.
ప్రధాని మోదీ మధ్యాహ్నం 2.10 గంటలకు శంషాబాద్ విమానాశ్రయం చేరుకుంటారు. అటునుంచి ఇక్రిశాట్, శ్రీరామనగరం వెళ్తారు. దీంతో మూడు ప్రాంతాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రధాని పర్యటించే ప్రాంతాలను ఎస్పీజీ డీజీ ఇప్పటికే రెండుసార్లు పరిశీలించారు.
కాగా, ప్రధాని మోదీ పర్యటనలో సీఎం కేసీఆర్ పాల్గొంటారు. మధ్యాహ్నం 2.10 గంటలకు శంషాబాద్ విమానాశ్రయంలో ప్రధాని మోదీకి సీఎం కేసీఆర్ స్వాగతం పలకనున్నారు. అనంతరం ప్రధానితో కలిసి ఇక్రిశాట్, శ్రీరామనగరం వెళ్తారు. కార్యక్రమం ముగిసిన తర్వాత సాయంత్రం 8.20 గంటలకు ఎయిర్పోర్టులో ప్రధానికి సీఎం కేసీఆర్ వీడ్కోలు పలకనున్నారు.
కాగా, ప్రధాని మోదీ ముచ్చింతల్ వస్తున్న నేపథ్యంలో యాగశాల ప్రాంగణంలో ఆంక్షలు అమలులో ఉంటాయని చినజీయర్ స్వామి తెలిపారు. అనుమతి ఉన్నవారు మాత్రమే యాగశాలకు రావాలని సూచించారు. ఆదివారం నుంచి యధాతథంగా యాగశాల పరిసరాల్లో అనుమతులు ఉంటాయని చెప్పారు. రాత్రి 8.30 గంటల తర్వాత ప్రధాని పర్యటన ముగుస్తుందని తెలిపారు.