కుమ్రం భీం ఆసిఫాబాద్, జనవరి 13 (నమస్తే తెలంగాణ): కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ కారిడార్లో అటవీ అధికారులు చేపట్టిన పులుల అన్వేషణ ఎట్టకేలకు ఫలించింది. విషప్రయోగంలో చనిపోయిందనుకున్న ఎస్-6 పులి క్షేమంగానే ఉన్నట్టు తెలిసింది. దరిగాం అటవీ ప్రాంతంలో ఎస్-6 పులి.. పశువులను వేటాడుతూ కెమెరాకు చిక్కింది. దరిగాం అడవుల్లో కే-15 ఈ నెల 6న మరణించగా, మరుసటి రోజే ఐదేండ్ల మగ పులి ఎస్-9 సైతం చనిపోయింది. దీంతో సీరియగా తీసుకున్న ఉన్నతాధికారులు లోతుగా దర్యాప్తు చేపట్టారు.
విషప్రయోగం జరిగినట్టు గుర్తించారు. అదే ప్రాంతంలో నాలుగు పులుల పాదముద్రలు లభించడంతో అన్వేషణ మొదలుపెట్టారు. ఈ నెల 9న టైగర్ రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించారు. మొదటి రోజు 14 ట్రాకింగ్ బృందాలు, 22 ట్రాప్ కెమెరాలతో దరిగాం అటవీ ప్రాంతాన్ని జల్లెడపట్టారు. పులుల జాడ తెలియకపోవడంతో ట్రాకింగ్ బృందాల సంఖ్యను 72కు పెంచి దరిగాంతోపాటు సర్కపల్లి, గొంది అటవీ ప్రాంతాల్లోనూ గాలింపు చర్యలు చేపట్టారు.
105 కెమెరాలను ఏర్పాటు చేసి పర్యవేక్షించారు. ఈ నెల 11న దరిగాం గొంది అటవీ ప్రాంతంలో పశువుపై పులి దాడి చేస్తూ ట్రాప్ కెమెరాకు చిక్కింది. దాని పాదముద్రల ఆధారంగా మూడేండ్ల వయస్సున్న ఆడపులి ఎస్-6గా అధికారులు గుర్తించారు. కే-14, కే-16, కే-17 పులుల పాదముద్రలను సైతం అటవీ అధికారులు గుర్తించారు. పులులు సురక్షితంగా ఉండటంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.