మంగపేట : ములుగు జిల్లా మంగపేట మండలం కొత్తూరు మొట్లగూడెం అటవీ ప్రాంతంలో పెద్దపులి జాడలు కనిపించాయి. ఈ మేరకు అటవీ శాఖ రేంజ్ అధికారి షకీల్పాషా ఆధ్వర్యంలో పెద్దపులి పాదముద్రలను బుధవారం గుర్తించారు. ఇటీవల ఈ ప్రాంతంలో పెద్దపులి ఓ ఆవుపై దాడి చేసి చంపడంతో పరిసర గూడాల వాసులను అప్రమత్తం చేసినట్లు రేంజ్ అధికారి షకీల్పాషా, పంచాయతీ కార్యదర్శి గుగులోతు చందూలాల్ తెలిపారు.
పులి మొట్లగూడెం అటవీ ప్రాంతం నుంచి బొమ్మాయిగూడెం మీదుగా నర్సాయిగూడెం, నర్సింహసాగర్, లేదా తాడ్వాయి మండలం దామెరవాయి అడవుల్లోకి వెళ్లి ఉంటుందని భావిస్తున్నారు. పాదముద్రలను పరిశీలించగా, అది మగపులిగా నిర్ధారణ అయినట్లు రేంజ్ అధికారి వెల్లడించారు. ఇదిలా ఉంటే ఏటూరునాగారం, కన్నాయిగూడెం మండలాల్లో ఎవరూ అడవిలోకి వెళ్లొద్దని అటవీ, పోలీసు అధికారులు సూచనలు చేశారు.