హైదరాబాద్, మార్చి 5 (నమస్తే తెలంగాణ): గతంలో ఎండాకాలం వచ్చిందంటే నీటి కోసం ధర్నాలు.. బిందెలతో కొట్లాటలు.. స్థానికుల నాయకుల ఇండ్ల ముట్టడి.. వాటర్ ట్యాంకర్ల కోసం పడిగాపులు కాసేవారు. ఉమ్మడి రాష్ట్రంలో ఈ దుస్థితిని చూసిన సీఎం కేసీఆర్ ఎంతో ముందుచూపుతో తాగునీటి సమస్య లేకుండా చేశారు. మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి స్వచ్ఛమైన నల్లా నీటిని సరఫరా చేస్తున్నారు. ఫలితంగా రాష్ట్రవ్యాప్తంగా మంచినీటి సమస్య లేకుండా పోయింది. అయితే రానున్న వేసవిలోనూ ఇదే తరహా సరఫరా చేసేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఎక్కడ కూడా నీటి సరఫరాలో సమస్యలు లేకుండా పట్టణ స్థాయిలో టాస్క్ బృందాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
లీకేజీలు, అనధికార నల్లా కనెక్షన్లు, నీటి దుర్వినియోగం లాంటి వాటికి చెక్ పెట్టి ఈ వేసవిలో ఎక్కడా తాగునీటి ఎద్దడి రాకుండా చేయాలని నిర్ణయించారు. ప్రజారోగ్య శాఖ ద్వారా సమస్యలకు పరిష్కారం చూపి, ప్రజలు ఇబ్బందులు పడకుండా ప్రణాళిక రూపొందించారు. వేసవిలో తాగునీటి సరఫరాపై ప్రజారోగ్య ఇంజనీర్లతో ఉన్నతాధికారులు సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు. క్షేత్రస్థాయిలో సన్నద్ధతపై సమాచారం సేకరించడంతోపాటు రాష్ట్రస్థాయిలో తీసుకోవాల్సిన నిర్ణయాలపై అభిప్రాయాలు తీసుకొన్నారు. రాష్ర్టంలోని పట్టణ స్థానిక సంస్థలకు ప్రతినిత్యం 1,291 మిలియన్ లీటర్ పర్ డే (ఎంఎల్డీ) నీటిని సరఫరా చేస్తున్నారు. దాదాపు అన్ని మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థల్లో రోజు విడిచి రోజు, ప్రతి రోజు నీటిని సరఫరా చేస్తున్నారు. వేసవిలోనూ ఇదే తరహా నీటి సరఫరా చేయాలని నిర్ణయించారు.
ప్రతిరోజు క్లోరిన్ లెవల్స్ పరీక్ష
ఎండాకాలంలో తాగునీటి ఎద్దడి రాకుండా ఉండేలా ప్రతి పట్టణంలో టాస్క్ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేశారు. ఈ బృందంలో ప్రజారోగ్య విభాగం ఇంజినీర్లు, మున్సిపల్ అధికారులు, శానిటేషన్ అధికారులు ఉంటారు. ఈ బృందం నిత్యం పట్టణంలో పర్యటిస్తూ తాగునీటి సరఫరా సమస్య ఉన్న ప్రాంతాలపై మున్సిపల్ కమిషనర్కు నివేదిక ఇస్తుంది. దీని ఆధారంగా కమిషనర్ అవసరమైన చర్యలు తీసుకుంటారు. ఈ బృందం క్లోరిన్ లెవల్స్తోపాటు హైడ్రోజన్ సల్ఫెడ్ పరీక్ష నిర్వహిస్తారు. అత్యవసరమైతే, ప్రత్యేక పరిస్థితులు ఉంటే అక్కడ ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయనున్నారు.