TGSRTC | హైదరాబాద్ తార్నాకలోని టీజీఎస్ఆర్టీసీ ఆస్పత్రిలో డిప్లొమేట్ ఆఫ్ నేషనల్ బోర్డ్ (డీఎన్బీ) పీజీ మెడికల్ కోర్సులకు అనుమతి లభించింది. మూడు విభాగాల్లో ఏడు సీట్లను నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్(ఎన్బీఈఎంఎస్) మంజూరు చేసింది.
డీఎన్బీ పీజీ మెడికల్ కోర్సులకు అనుమతి కోరుతూ ఎన్బీఈఎంఎస్కు ఇటీవల టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం దరఖాస్తు చేసింది. ఆర్టీసీ ఉద్యోగులకు మెరుగైన, నాణ్యమైన వైద్యం అందించేందుకు తమ ఆసుపత్రిలో పీజీ మెడికల్ కోర్సులకు అక్రిడిటేషన్ ఇవ్వాలని ప్రతిపాదించింది. ఈ దరఖాస్తును సమగ్రంగా పరిశీలించిన ఎన్బీఈఎంఎస్.. జనరల్ మెడిసిన్ 3 సీట్లను, జనరల్ సర్జరీ 2 సీట్లను, ఆర్థోపెడిక్ సర్జరీ 2 సీట్లను మంజూరు చేసింది.
మూడేండ్ల పీజీ కోర్సులకు నీట్ ఆధారంగా, 2 ఏండ్ల డిప్లొమా కోర్సులకు డీఎన్బీ-పీడీసీఈటీ ద్వారా ప్రవేశాలు జరగుతాయి. వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఈ కోర్సులు ప్రారంభం కానున్నాయి.
తార్నాక ఆసుపత్రిలో డీఎన్బీ పీజీ మెడికల్ కోర్సులకు అనుమతి లభించడంపై టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం హర్షం వ్యక్తం చేసింది. ఈ డీఎన్బీ పీజీ కోర్సులకు అనుమతి లభించడంతో ఆస్పత్రిలో వైద్య సేవలు మరింత బలోపేతమవుతాయని సంస్థ ఎండీ వీసీ సజ్జనార్ ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ కోర్సుల వల్ల నాణ్యమైన వైద్యులు తమ ఆస్పత్రిలో ప్రాక్టిస్ చేస్తారని, ఇది ఆర్టీసీ ఉద్యోగుల ఆరోగ్య భద్రతకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని పేర్కొన్నారు. సిబ్బందికి మెరుగైన వైద్యం అందించేందుకు తార్నాక ఆస్పతిని సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిగా టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం తీర్చిదిద్దిందని గుర్తు చేశారు. ఉద్యోగులకు మెరుగైన వైద్యసేవలను అందించి సంపూర్ణ ఆరోగ్య ఆర్టీసీగా మార్చేందుకు యాజమాన్యం కృతనిశ్చయంతో ఉందని వివరించారు. డీఎన్బీ పీజీ మెడికల్ కోర్సులకు అనుమతి తీసుకురావడంలో కీలకపాత్ర పోషించిన మెడికల్ అడ్మినిస్ట్రేటర్ డాక్టర్ శ్రీనివాస్, మాజీ ఓఎస్డీ డాక్టర్ సైది రెడ్డి, డాక్టర్లు సుస్మిత, ప్రమోద్ కుమార్, ప్రదీప్ కుమార్, రాజ్ కుమార్ లను టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం అభినందించింది. హైదరాబాద్ బస్ భవన్ లో సోమవారం ఆర్టీసీ ఉన్నతాధికారులతో కలిసి వారిని ఎండీ వీసీ సజ్జనర్ సన్మానించారు.