Uppulapalli | కమలాపూర్, మార్చి 8: మద్యం రక్కసి ముగ్గురు యువకుల ఉసురు తీసింది. పసిబిడ్డలకు తండ్రిని, కుటుంబానికి పెద్దను దూరంచేసింది. దీంతో గ్రామస్తులు ఆలోచనలో పడ్డారు. సర్వ అనర్థాలకు కారణమైన మద్యం రక్కసిని తమ గ్రామం నుంచి తరిమికొట్టాలని నిర్ణయించుకున్నారు. వెంటనే సర్పంచ్ను సంప్రదించి గ్రామంలోని బెల్టుషాపులన్నీ మూసివేయాలని సర్పంచ్ను డిమాండ్ చేశారు.
ఈ మేరకు బెల్టుషాపుల నిర్వాహకులతో మద్యం అమ్మకాలు చేపట్టబోమని రాతపూర్వకంగా ప్రమాణం తీసుకున్నారు. మద్యం అమ్ముతుండగా పట్టుకున్న వ్యక్తులకు రూ.10వేలు బహుమానంగా ఇస్తామని ప్రకటించారు. దీంతో గత ఈ 20 రోజులుగా ఆ గ్రామంలో మద్య నిషేధం కొనసాగుతూ ఇతర గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తున్నది.
హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం ఉప్పులపల్లి గ్రామంలో 600కు పైగా జనాభా ఉంది. సుమారు 470 మంది ఓటర్లు ఉన్న ఈ గ్రామంలో నాలుగు బెల్టుషాపులు ఉన్నాయి. పరకాల – హుజూరాబాద్ రహదారి పక్కనే ఉన్న ఈ గ్రామంలో బస్టాప్ వద్ద రెండు, గ్రామంలోపల మరో రెండు బెల్టుషాపులు ఉన్నాయి. ఇటీవల 35 ఏండ్లలోపు యువకులు ముగ్గురు మద్యం తాగి మృత్యవాత పడ్డారు. భార్యా, పిల్లలు కుటుంబ పెద్దను కోల్పోవడం గ్రామస్తులను కలచివేసింది.
మద్యానికి బానిసలైన పలువురు రోజూ తాగివచ్చి తల్లిదండ్రులపై సైతం చేయి చేసుకుంటున్నారు. చుట్టుపక్కల గ్రామాల యువకులు కూడా వచ్చి బెల్టుషాపుల్లో మద్యం తాగి గొడవలకు దిగుతున్నారు. గ్రామం ప్రశాంతంగా ఉండాలంటే బెల్టుషాపులు ఎత్తేయడమే మార్గమని గుర్తించారు. మహిళలు ముందుకు రావడంతో సర్పంచ్ బెల్టుషాపుల నిర్వాహకులతో మాట్లాడారు. మద్యం అమ్మకాలు చేపట్టబోమని వారు గ్రామస్తుల సమక్షంలో రాసి ఇచ్చారు. మద్యం అమ్మకాల నిలిపివేతతో కుటుంబాల్లో గొడవలు సద్దుమణిగాయి.
గ్రామంలోని యువతను కాపాడుకునేందుకే బెల్టుషాపుల్లో మద్యం అమ్మకాలు నిలిపివేశాం. 35 ఏండ్లు దాటకముందే మద్యానికి బానిసై చనిపోతుండటంతో వారి భార్య, పిల్లలు రోడ్డున పడుతున్నరు. అర్థరాత్రి వరకు బెల్టుషాపుల్లో మద్యం తాగి ఇంటికి వచ్చి గొడవలు చేస్తున్నారు. మద్యం తాగడం వల్ల యువత 10 కిలోల బరువు కూడా లేపలేని స్థితిలో ఉన్నారు. బెల్టుషాపులు ఇలాగే కొనసాగితే మా ఊరిలో యువకులే కరువయ్యే పరిస్థితి వచ్చింది. యువతను కాపాడుకునేందుకే బెల్టుషాపులు బంద్ చేయించాం.
– ర్యాకం శ్రీనివాస్, సర్పంచ్, ఉప్పులపల్లి
గ్రామంలో మద్యం అమ్మకాలు చేపట్టకుండా మహిళలు ముందుకురావడంతో బెల్టుషాపులు మూతపడ్డాయి. రోజూ తాగివచ్చిన భర్తలు భార్యలను వేధిస్తున్నారు. దీంతో మహిళలంతా వెళ్లి సర్పంచ్ను వేడుకున్నారు. గ్రామస్తులంతా మద్యం అమ్మకాలను నిలిపివేసేందుకు ఒక్కతాటిపై నిలబడ్డారు.
– బాలకృష్ణ, గ్రామస్తుడు