మనోహరాబాద్, సెప్టెంబర్ 25: చెరువులో పడి ముగ్గురు మహిళలు మృతి చెందగా, మరో బాలుడు గల్లంతైన ఘటన మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం రంగాయిపల్లిలో సోమవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఫిరంగి చంద్రయ్య ఇంట్లో ఆదివారం బోనాల జాతర నిర్వహించారు. జాతరకు సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం అంబర్పేట గ్రామానికి చెందిన దొడ్డ బాలమణి (30), ఆమె కుమారుడు దొడ్డ చరణ్ (6), దొడ్డ లక్ష్మి(30) హాజరయ్యారు.
ఈ ముగ్గురితో పాటు ఫిరంగి చంద్రయ్య భార్య లక్ష్మి, ఆమె కూతురు లావణ్య (20) కలిసి బట్టలు ఉతికేందుకు గ్రామ చెరువు వద్దకు వెళ్లారు. ఈ క్రమంలో బాలుడు దొడ్డ చరణ్ ఆడుకుంటూ కాలు జారి చెరువులో పడిపోయాడు. బాలుడిని కాపాడేందుకు బాలమణి, లక్ష్మి, లావణ్య ఒకరివెంట ఒకరు చెరువులోకి దిగి మునిగిపోయారు. దొడ్డ బాలమణి, దొడ్డ లక్ష్మి, ఫిరంగి లావణ్యలు మృత్యువాత పడ్డారు.
ఫిరంగి లక్ష్మిని స్థానికులు కాపాడారు. విషయం తెలుసుకున్న గ్రామస్థులు, పోలీసులు చెరువు వద్దకు చేరుకొని ముగ్గురి మృతదేహాలను బయటకు తీశారు. బాలుడు చరణ్ కోసం గాలిస్తున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. బాధితుల కుటుంబాన్ని మెదక్ జడ్పీ చైర్పర్సన్ ర్యాకల హేమలతాశేఖర్గౌడ్ పరామర్శించారు.