ప్రజలకు అవగాహన, పరీక్షలు, చికిత్సలే లక్ష్యం
సీఎం కేసీఆర్ విధానాలతో తగ్గిన వ్యాధులు
మలేరియారహిత రాష్ట్రం దిశగా అడుగులు
సమీక్షలో వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు
హైదరాబాద్, జూలై 5 (నమస్తే తెలంగాణ): వానకాలంలో సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని వైద్యారోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు పేర్కొన్నారు. సీజనల్ వ్యాధుల నుంచి ప్రజలను కాపాడేందుకు మూడంచెల విధానం అనుసరించాలని ఆదేశించారు. అవగాహన కల్పించడం, వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయడం, త్వరితగతిన చికిత్స అందించడమే లక్ష్యంగా ముందుకు సాగాలని చెప్పారు. ప్రజలకు అవగాహన కల్పించే విషయంలో పంచాయతీరాజ్ సహా ఇతర శాఖలు, స్థానిక ప్రజాప్రతినిధుల సహకారం తీసుకోవాలని సూచించారు. తెలంగాణ సాంసృతిక సారథి కళాజాత బృందాలతో ప్రచారం చేయించాలని తెలిపారు. హైదరాబాద్లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కార్యాలయం నుంచి రాష్ట్రంలోని ఐటీడీఏల పరిధిలోని ఏటూరునాగారం, ఉట్నూర్, భద్రాద్రి కొత్తగూడెం, నాగర్కర్నూల్లో సీజనల్ వ్యాధులపై మంత్రి మంగళవారం టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు.
ఎండల తీవ్రత తగ్గుముఖం పట్టి, వానలు మొదలవడంతో వాతావరణం ఒక్కసారిగా మారి అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం పెరిగిందన్నారు. తెలంగాణ రాక ముందు వానకాలంలో గిరిజన ప్రాంతాలు సీజనల్ వ్యాధులతో అల్లాడిపోయేవని, పెద్ద సంఖ్యలో క్యాంపులు ఏర్పాటు చేసి వైద్యం అందించాల్సి వచ్చేదని గుర్తుచేశారు. స్వరాష్ట్రంలో అలాంటి పరిస్థితులు లేవన్నారు. సీఎం కేసీఆర్ మార్గ నిర్దేశంలో ప్రతి పల్లెకు వైద్యం చేరువైందని తెలిపారు. జ్వర సర్వే, ఇంటింటికీ మందుల సరఫరా, సబ్ సెంటర్ల ఏర్పాటు, పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి వంటి కార్యక్రమాలు వ్యాధుల నియంత్రణకు దోహదం చేస్తున్నాయని వివరించారు. మిషన్ భగీరథ ద్వారా శుద్ధిచేసిన తాగునీరు ఇస్తుండటంతో జబ్బులు తగ్గుముఖం పట్టాయని అన్నారు. మొత్తంగా ఒక గుణాత్మక మార్పు వచ్చి, మలేరియా రహిత రాష్ట్రం దిశగా తెలంగాణ అడుగులు వేస్తున్నదని కేంద్ర ప్రభుత్వమే చెప్పిందని తెలిపారు. మలేరియా నియంత్రణలో క్యాటగిరీ- 2 నుంచి క్యాటగిరీ 1కి చేరామని అన్నారు.
పరీక్షలు నిర్లక్ష్యం చేయొద్దు..
కరోనా, సీజనల్ వ్యాధుల లక్షణాలు దాదాపు ఒకేలా ఉంటాయని హరీశ్రావు అన్నారు. అందుకే ఏ మాత్రం నిర్లక్ష్యం చేయకుండా పరీక్షలు నిర్వహించాలని సూచించారు. సమీపంలోని ప్రభుత్వ దవాఖానల్లో అన్ని రకాల పరీక్షలు చేయించుకొనే వెసులుబాటు ఉన్నదన్నారు. ఐటీడీఏ ప్రాంతాల్లో అత్యవసర పరిస్థితులు ఎదురొనేలా ప్రత్యేక వైద్య బృందాలను ఏర్పాటు చేసుకోవాలని, సంబంధిత శాఖలతో సమన్వయ సమావేశాలు ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించారు. 108 వాహనాలు వెళ్లలేని ప్రాంతాలను ముందే గుర్తించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. వాగులు పొంగి రోడ్లు కొట్టుకుపోయే గిరిజన ప్రాంతాల్లో వ్యాధిగ్రస్థులైనవారితోపాటు గర్భిణుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని చెప్పారు. విస్తృతంగా దోమ తెరలను పంపిణీ చేయాలని, దోమలను నివారించడానికి ఫాగింగ్, నీటి నిల్వలేకుండా చూసుకోవాలని తెలిపారు. ఈ విషయాల్లో పంచాయతీరాజ్, వైద్యశాఖలను అప్రమత్తం చేయాల్సిన బాధ్యత కలెక్టర్, ఐటీడీఏ పీవోలదే అని పేర్కొన్నారు. సమీక్షలో హెల్త్ సెక్రటరీ రిజ్వీ, డీహెచ్ శ్రీనివాస్రావు, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ శ్వేత మహంతి, టీవీవీపీ కమిషనర్ అజయ్కుమార్, డీఎంఈ రమేశ్రెడ్డి, టీఎస్ఎంస్ఐడీసీ ఎండీ చంద్రశేఖర్రెడ్డి, జాతీయ కీటక జనిత వ్యాధుల నియంత్రణ కార్యక్రమ జేడీ అమర్సింగ్, ఐటీడీఏ పరిధిలోని 11 జిల్లాల కలెక్టర్లు సిక్తా పట్నాయక్, రాహుల్రాజ్, భవిష్ మిశ్రా, గౌతం, అనుదీప్, శశాంక, భారతి, కృష్ణా ఆదిత్య, ఉదయ్కుమార్, రాహుల్ శర్మ, గోపి, ఐటీడీఏ పీవోలు గౌతమ్, వరుణ్రెడ్డి, అంకిత్, అశోక్, జిల్లా వైద్యాధికారులు, ప్రోగ్రాం ఆఫీసర్లు పాల్గొన్నారు.
మరింత అప్రమత్తత అవసరం..
సీజనల్ వ్యాధుల విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలని అధికారులకు మంత్రి హరీశ్రావు సూచించారు. మలేరియా, డెంగ్యూ, చికున్ గున్యా వంటివి పూర్తి నియంత్రణలో ఉండేలా చూసుకోవాలని చెప్పారు. ఒకటి, రెండు కేసులు నమోదు కాగానే ఆ ప్రాంతంపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. అవసరం ఉన్న చోట ప్రత్యేకంగా క్యాంపులు ఏర్పాటు చేసి, సత్వర చికిత్స అందించాలని స్పష్టంచేశారు. పరిసరాల పరిశుభ్రత లోపించి దోమలు, ఈగలు వ్యాప్తిచెంది వ్యాధులు ప్రబలే ఆసారం ఉన్నదని, దీనిని దృష్టిలో ఉంచుకొని పారిశుద్ధ్యంపై ప్రజలకు అవగాహన కల్పించాలని చెప్పారు. ముఖ్యంగా ఏటూరునాగారం, ఉట్నూర్, భద్రాద్రి కొత్తగూడెం, నాగర్కర్నూల్ ప్రాంతాల్లో మరింత అప్రమత్తంగా ఉండాలని స్పష్టంచేశారు. ప్రణాళిక ప్రకారం గిరిజన ప్రాంతాల్లో సీజనల్ వ్యాధుల నుంచి ప్రజలను కాపాడుకోవాలని చెప్పారు.
ఐదుగురు నర్సులకు మంత్రి హరీశ్రావు అభినందనలు
రాష్ట్రం నుంచి నేషనల్ ఫ్లొరెన్స్ నైటింగేల్ అవార్డ్స్-2022 అందుకొన్న ఐదుగురు నర్సులను వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు అభినందించారు. అవార్డు విజేతలు సుజాత, ఫ్లోరెన్స్, లక్ష్మణ్, మంజుల, రాజేశ్వరిని అభినందిస్తూ ఆయన మంగళవారం ట్వీట్ చేశారు. కరోనా సమయంలో ఉత్తమ సేవలు అందించినందుకు వారికి ఈ అవార్డులు లభించాయి. నేషనల్ ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, ది న్యూస్పేపర్ అసోసియేషన్ ఆఫ్ కర్ణాటక సంయుక్తంగా ఈ అవార్డులను ప్రకటించాయి.