భూత్పూర్, ఫిబ్రవరి 21: కారు అదుపుతప్పి చెట్టును ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. ఈ ఘటన బుధవారం మహబూబ్నగర్ జిల్లాలో చోటుచేసుకున్నది. ఆంధ్రప్రదేశ్లోని అనంతపూర్కు చెందిన ఎస్సై నండూరి వెంకటరమణ(55) తన కూతురు అనూషకు హైదరాబాద్లోని మణికొండకు చెందిన పవన్సాయి(27)తో ఈ నెల 14న వివాహం జరిపించాడు. బుధవారం హైదరాబాద్లోని అల్లుడి ఇంట్లో విందుకు హాజరయ్యాడు. అనంతరం కారు(ఏపీ 02 బీఆర్ 2556)లో కూతురు, అల్లుడితోపాటు కారు డ్రైవర్ చందు(25)తో కలిసి అనంతపూర్కు బయలుదేరాడు. భూత్పూర్ మండలం అన్నాసాగర్ సమీపంలోని జాతీయ రహదారిపైకి రాగానే వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న ఇనుప రాడ్డును తాకింది. పల్టీలు కొడుతూ సమీపంలోని చెట్టును ఢీకొన్నది. ఈ ప్రమాదంలో వెంకటరమణతోపాటు అల్లుడు పవన్సాయి, డ్రైవర్ చందు అక్కడికక్కడే మృతి చెందారు. ఆయన కూతురు అనూషకు తీవ్ర గాయాలయ్యాయి. కారు పూర్తిగా ధ్వంసమైంది. స్థానికులు వారిని అంబులెన్స్లో జిల్లా దవాఖానకు తరలించారు. విషయం తెలుసుకున్న మహబూబ్నగర్ డీఎస్పీ వెంకటేశ్వర్లు, భూత్పూర్ సీఐ రామకృష్ణ ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసినట్టు ఎస్సై శ్రీనివాసులు తెలిపారు.