గద్వాల: జోగులాంబ గద్వాల (Jogulamba Gadwal) జిల్లా గోనుపాడు వద్ద ఘోర ప్రమాదం (Road accident) జరిగింది. శనివారం ఉదయం గోనుపాడు సమీపంలోని పార్చర్లమిట్ట వద్ద వేగంగా దూసుకొచ్చిన బొలెరో (Bolero) అదుపుతప్పి ఆటోను ఢీకొట్టింది. దీంతో అందులో ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడికక్కడే మరణించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని దవాఖానకు తరలించారు. మృతులను గద్వాల మున్సిపాలిటీ పరిధిలోని దౌదర్పల్లికి చెందిన జమ్ములు (45), అర్జున్, వైశాలిగా గుర్తించారు.
వీరంతా ఒకే కుటుంబానికి చెందినవారని తెలిపారు. పాత బట్టలు అమ్ముకొని జీవనం సాగిస్తుంటారని చెప్పారు. గద్వాల నుంచి కర్ణాటకలోని రాయ్చూర్ (Raichur) వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని చెప్పారు. ప్రమాదానికి కారణమైన బొలెరో డ్రైవర్ అక్కడినుంచి పరారయ్యాడని వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.