Suryapet | సూర్యాపేట : సూర్యాపేట జిల్లాలోని నాగారంలో విషాదం నెలకొంది. ప్రమాదవశాత్తు ఓ ఇంటి గోడ కూలిపోయింది. దీంతో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు.
నాగారం గ్రామానికి చెందిన శీలం రాములు(85), శీలం రాములమ్మ(70) భార్యాభర్తలు. వీరికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. అయితే ఇటీవల కురిసిన భారీ వర్షాలకు రాములు ఇల్లు పూర్తిగా మెత్తబడింది. అయితే బుధవారం రాత్రి ఇంటి గోడ కూలిపోయింది. ఆ సమయంలో రాములు, రాములమ్మ, కుమారుడు శ్రీనివాస్(38) అదే ఇంట్లో నిద్రిస్తున్నారు. గోడ ఆ ముగ్గురిపై కూలడంతో ప్రాణాలు కోల్పోయారు.
అయితే గురువారం ఉదయం విద్యుత్ అధికారులు.. కరెంట్ బిల్లు కోసం వెళ్లగా గోడ కూలిన దృశ్యాలు కనిపించాయి. శిథిలాల కింద ముగ్గురు వ్యక్తులు ఉన్నట్లు నిర్ధారించారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించగా, ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను వెలికితీసి, పోస్టుమార్టం నిమిత్తం తుంగతుర్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడు శ్రీనివాస్కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మృతుల కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.