హైదరాబాద్ : తెలంగాణ పట్టణాలకు మరో మూడు అవార్డులు వచ్చాయి. ఫిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్, అలంపూర్, కోరుట్ల మున్సిపాలిటీలను ఇండియన్ స్వచ్ఛత లీగ్ ( Indian Swachhata League ) అవార్డులకు కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. ఈ మేరకు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ సంయుక్త కార్యదర్శి రూపా మిశ్రా రాష్ట్రానికి సమాచారం అందించారు. ఈ నెల 30న ఢిల్లీలోని తలటోరా స్టేడియంలో జరిగే కార్యక్రమంలో ఈ అవార్డులను ప్రదానం చేయనున్నారు.
గార్బెజ్ ఫ్రీ సిటీస్లో భాగంగా ఇండియన్ స్వచ్ఛత లీగ్ అవార్డులను అందిస్తున్నారు. ఇందులో 15వేల లోపు జనాభా ఉన్న పట్టణాల కేటగిరీలో అలంపూర్ పట్టణం ఎంపికైంది. 25 నుంచి 50 వేల వరకు జనాభా ఉన్న పట్టణాల విభాగంలో ఫిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్, 50 వేల నుంచి లక్ష జనాభా ఉన్న కేటగిరీలో కోరుట్ల పట్టణాలు ఎంపికయ్యాయి. తెలంగాణ నుంచి ఇప్పటికే 16 పట్టణాలకు స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులు వచ్చాయి. ప్రస్తుతం ప్రకటించిన మూడు అవార్డులతో కలిపి మొత్తం తెలంగాణకు 19 అవార్డులు వచ్చాయి.