కొత్తగూడెం క్రైం, ఏప్రిల్ 6 : సరిహద్దు ఏజెన్సీ అటవీ ప్రాంతంలో మళ్లీ తుపాకుల మోత మోగింది. మావోయిస్టులు, భద్రతా దళాలకు మధ్య తెలంగాణ-ఛత్తీస్గఢ్ రాష్ర్టాల సరిహద్దులో శనివారం జరిగిన భీకర పోరులో ముగ్గురు మావోయిస్టులు మృతిచెందారు. బీజాపూర్ జిల్లా ఎస్పీ జితేంద్ర యాదవ్ ప్రాథమికంగా వెల్లడించిన వివరాల ప్రకారం.. తెలంగాణ-ఛత్తీస్గఢ్ సరిహద్దు అడవుల్లో మావోయిస్టులు ఉన్నట్టు పోలీసులకు సమా చారం అందింది. దీంతో ములుగు జిల్లా సరిహద్దుల్లోని పూజార్ కాం కేర్ అటవీ ప్రాంతం లో తెలంగాణ గ్రేహౌండ్స్, ఛత్తీస్గఢ్ పోలీస్ బలగాలు సంయుక్తంగా కూంబింగ్ ఆపరేషన్ నిర్వహించాయి.
ఈ క్రమంలో కర్రిగుట్ట వద్ద మావోయిస్టులు తారసపడి పోలీసు బలగాలపై కాల్పులు జరిపారు. అప్రమత్తమైన పోలీసులు ఎదురు కాల్పులకు దిగారు. దీంతో ఇరువర్గాల మధ్య సుమారు 40 నిమిషాలపాటు భీకరపోరు సాగింది. ఈ క్రమంలో కాల్పుల్లో మృతిచెందిన ముగ్గురు మావోయిస్టుల మృతదేహాలతోపాటు ఎల్ఎంజీ, ఏకే-47, 12 బోర్ రైఫిల్. ఆయుధ, వస్తు సామగ్రిని జవాన్లు స్వాధీనం చేసుకొన్నారు. మృతిచెందిన ముగ్గు రు మావోయిస్టులు ఎవరనేది తెలియాల్సి ఉన్నది.
ఆ మృతదేహాలను పోలీసులు బీజాపూర్ జిల్లా కేంద్రానికి తరలించారు. కాగా ఏప్రిల్ మొదటి వారంలోనే 17 మంది మావోయిస్టులు ఖతమయ్యారు. 2న బీజాపూర్ జిల్లా పోర్చెలిలో జరిగిన ఎదురుకాల్పుల్లో 11 మంది హతమయ్యారు. ఆ మరుసటి రోజు మరో ముగ్గురు ఎన్కౌంటరయ్యారు.