Bhadradri Kothagudem | భద్రాచలం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలం పట్టణంలో ముగ్గురు మావోయిస్టు కొరియర్లు పట్టుబడ్డారు. వారి వద్ద నుంచి భారీగా పేలుడు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ వివరాలను శనివారం భద్రాచలం పట్టణంలో భద్రాచలం ఏఎస్పీ పరితోశ్ పంకజ్ విలేకరులకు వెల్లడించారు.
శనివారం తెల్లవారుజామున 5 గంటల సమయంలో భద్రాచలం పట్టణ ఎస్ఐ, పోలీసులు స్థానిక ఆర్టీసీ బస్టాండ్లో తనిఖీలు నిర్వహిస్తుండగా 7వ నెంబర్ ఫ్లాట్ఫారం వద్ద అనుమానాస్పదంగా కనిపించిన ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించగా చర్ల మండలం నాయకులకొత్తూరు గ్రామానికి చెందిన గుంజి విజయ్, హన్మకొండ జిల్లా భీందేవరపల్లి మండలం వంగర గ్రామానికి చెందిన బొంత నవీన్, మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం బడితండాకు చెందిన భూక్యా నవీన్గా గుర్తించారు.
విజయ్ ఐదేళ్లుగా మావోయిస్టులకు కొరియర్గా పనిచేస్తూ వారికి పేలుడు పదార్థాలను సరఫరా చేస్తున్నాడు. కాగా.. నవీన్ పేలుడు పదార్థాల దుకాణ యజమాని. నవీన్ మహబూబాబాద్ జిల్లా శనిగాపురంలో తిరుమల ఏజెన్సీ పేరుతో పేలుడు పదార్థాలను విక్రయిస్తున్నాడు. గతంలో కూడా విజయ్కు పేలుడు పదార్థాలను విక్రయించాడు. వాటిని విజయ్ మావోయిస్టులకు అందజేశాడు. మళ్లీ వారితో ఒప్పందం కుదుర్చుకునేందుకు ఛత్తీస్గఢ్ అటవీ ప్రాంతానికి వెళ్లేందుకు భద్రాచలం బస్టాండ్లో వేచి ఉన్న క్రమంలో పోలీసులకు పట్టుబడినట్లు ఏఎస్పీ పేర్కొన్నారు. వారిపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు.