KTR | తమ పార్టీ అధినేత కేసీఆర్ అధికారంలో ఉండటం కన్నా ప్రతిపక్షంలో ఉండటమే కాంగ్రెస్ పార్టీకి ప్రమాదకరమని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తేల్చిచెప్పారు. మంగళవారం తెలంగాణ భవన్లో ఖమ్మం బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ సన్నాహక సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడిన కేటీఆర్ సీఎం అనే రెండక్షరాల కన్నా కేసీఆర్ అనే మూడు అక్షరాలే పవర్ ఫుల్ అన్నారు. ఫిబ్రవరిలో కేసీఆర్ ప్రజల మధ్యకు వస్తారని తెలిపారు. పార్లమెంటు నియోజక వర్గాల సమీక్షలు ముగియగానే అసెంబ్లీ నియోజక వర్గాల సమీక్షలు ఉంటాయని, త్వరలోనే రాష్ట్ర, జిల్లా కమిటీలు ఏర్పాటు చేయనున్నామని ఆయన వెల్లడించారు. ప్రతీ రెండు మూడు నెలలకోసారి అన్ని స్థాయిల కమిటీల సమావేశాలు క్రమం తప్పకుండా ఏర్పాటు చేస్తామని తెలిపారు.
స్వల్పకాలంలోనే ప్రజల విశ్వాసాన్ని కోల్పోయే లక్షణం కాంగ్రెస్ పార్టీ సొంతమని కేటీఆర్ పేర్కొన్నారు. ఆ పార్టీ గత చరిత్రను పరిశీలిస్తే అర్థమయ్యేది అదేనన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మం ఒకే ఒక్క బీఆర్ఎస్ ఎమ్మెల్యే గెలిచినా లోక్సభ స్థానాన్ని బీఆర్ఎస్ కైవసం చేసుకున్న విషయాన్ని ఆయన గుర్తుచేస్తూ ఈసారి అదే చరిత్రను పునరావృతం చేయాలని ఆయన పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. 1989 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీని తిరస్కరించి కాంగ్రెస్ను గెలిపించిన ప్రజలు.. కేవలం ఏడాదిన్నర స్వల్పకాలంలోనే ఆ పార్టీ మీద విశ్వాసాన్ని కోల్పోయారని ఉదహరించారు. ప్రజా విశ్వాసం కోల్పోయిన కాంగ్రెస్ పార్టీ అనంతరం జరిగిన అప్పటి లోకసభ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలయ్యిందని, ఆ ఎన్నికల్లో ప్రజలు టీడీపీని తిరిగి భారీ మెజారిటీ తో గెలిపించారన్నారు. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నిలుపుకునే నిజాయితీ చిత్తశుద్ధి కాంగ్రెస్ పార్టీకి ఉండదన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై నెలదాటిందన్నారు. తాము అధికారంలోకి వచ్చిన తెల్లారినుంచే తామిచ్చిన వాగ్దానాలు అమలు చేస్తామని ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ ఎస్సీ, ఎస్టీ, బీసీ ఇతర వర్గాలకు ఇచ్చిన హామీల అమలులో కాలాయపన దిశగా అడుగులేస్తున్నదని చెప్పారు.
కాంగ్రెస్ పార్టీ నెల రోజుల పాలనా పోకడలే అందుకు సాక్ష్యం అన్నారు. వాగ్దానం చేసిన దానికి భిన్నంగా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరించడం పట్ల ప్రజల్లో అసహనం ప్రారంభమైందని చెప్పారు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగే అవకాశం ఉందని తెలిపారు. ప్రజలకిచ్చిన వాగ్దానాల అమలుకోసం కాంగ్రెస్ పార్టీ మీద ఒత్తిడితెస్తూ రాష్ట్ర ప్రజలకోసం బీఆర్ఎస్ పార్టీ పోరాడుతుందన్నారు. ఆ దిశగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కార్యోన్ముఖులు కావాలని పిలుపునిచ్చారు. అధికారంలో ఉన్నప్పటికన్నా ప్రతిపక్షంలో ఉంటేనే మరింత పోరాట పటిమ చూపగలమని కేటీఆర్ ఉద్బోదించారు. ఉద్యమంలో గట్టిగా పోరాడిన చరిత్రను ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశారు. పార్టీ ఇటీవల నిర్వహించిన అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా జరిగిన సమావేశాలే అందుకు నిదర్శమన్నారు. బీఆర్ఎస్ పార్టీకి ఉన్న పోరాట పటిమకు మరింత సానపెట్టాల్సిన అవసరం ఉందన్నారు.