ఎల్కతుర్తి/పాల్వంచ/ తల్లాడ, ఏప్రిల్ 10 : ఎండల తీవ్రతతో వడదెబ్బ తగిలి ముగ్గురు కూలీలు మృతిచెందిన ఘటన శుక్రవారం చోటుచేసుకున్నది. ఉమ్మడి ఖమ్మం జిల్లా పాల్వంచ నవభారత్ ఏరియా కేసీఆర్ నగర్కు చెందిన బానోత్ భద్రు(57) మూడురోజులుగా కొత్తగూడెం రుద్రంపూర్ ఏరియాలో ఎండలోనే సుతారి కూలీగా పని చేస్తున్నాడు. ఈ క్రమంలో వడదెబ్బ తగలడంతో కుటుంబ సభ్యులు ఖమ్మం దవాఖానకు తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతిచెందాడు. తల్లాడ మండలం రామచంద్రాపురం గ్రామానికి చెందిన పులి సత్యనారాయణ(58) వ్యవసాయ కూలి పనులకు వెళ్లి ఎండ తీవ్రతకు తట్టుకోలేక కుప్పకూలిపోయాడు.
చుట్టుపక్కల వారు దవాఖానకు తరలించగా అప్పటికే మృతిచెందినట్టు వైద్యులు నిర్ధ్దారించారు. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం గట్లనర్సింగాపూర్కు చెందిన బరిగె శోభ(45) శుక్రవారం ఎల్కతుర్తి మండలం కోతులనడుమలో సీడ్ వరిలో పువ్వు దులిపేందుకు వెళ్లింది. ఎండ తీవ్రతకు అస్వస్థతకు గురైంది. దీంతో మధ్యాహ్నం పని ముగిశాక ట్రాక్టర్లో ఇంటికి వెళ్తుండగా గోపాల్పూర్ గ్రామానికి చేరుకోగానే మృతి చెందింది.