హైదరాబాద్ : పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గంగానగర్ గోదావరి దాబా వద్ద ఎదురెదురుగా వచ్చిన రెండు లారీలు ఢీకొట్టి పక్కనే వెళ్తున్న ఆటోపై పడ్డాయి. ఈ ఘటనలో దంపతులతో పాటు ఓ చిన్నారి దుర్మరణం పాలవగా.. మరో రెండు నెలల చిన్నారి మృత్యువును జయించింది. మృతులను రామగుండంకు చెందిన వారీగా గుర్తించారు. వివరాల్లోకి వెళితే రామగుండానికి చెందిన షేక్ షకిల్, అతని భార్య రేష్మ ఇద్దరు పిల్లలు మృతులను మంచిర్యాల జిల్లా ఇందారంలో ఓ శుభకార్యానికి ఆటోలో బయలుదేరారు.
ప్రమాద సమయంలో ఆటోలో మరో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఈ క్రమంలో గంగానగర్ వద్ద ఫ్లై ఓవర్ యూటర్న్ చేస్తున్న బొగ్గు లారీని.. ఫ్లై ఓవర్పై నుంచి వచ్చిన మట్టి లారీ ఢీకొట్టింది. లారీ పక్క నుంచి వెళ్తున్న ఆటోపై పడింది. ఈ ఘటనలో దంపతులతో పాటు ఓ చిన్నారి మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని క్రేన్ సహాయం రెండు నెలల చిన్నారిని బయటకు తీశారు. ప్రమాదంలో మరో ఇద్దరు గాయపడగా.. వారిని ఆసుప్రతికి తరలించి చికిత్స అందిస్తున్నారు.