Road Accident | దైవ దర్శనానికి వెళ్లి వస్తూ రోడ్డు ప్రమాదంలో దంపతులతో పాటు కొడుకు మృతి చెందాడు. కూతురు పరిస్థితి విషమంగా ఉన్నది. ఈ ఘటన నాగర్ కర్నూల్ జిల్లా ఉర్కొంట శివారులోని 167వ జాతీయ రహదారిపై చోటు చేసుకున్నది. వివరాల్లోకి వెళితే.. కల్వకుర్తికి చెందిన వెంకటయ్య అనే వ్యక్తి ద్విచక్ర వాహనంతో భార్య, పిల్లలతో కలిసి ఉర్కొండపేట ఆంజనేయస్వామి దర్శనానికి వెళ్లాడు.
అక్కడ దర్శనం చేసుకున్నారు. ఆ తర్వాత ద్విచక్ర వాహనంపై ఇంటికి బయలుదేరారు. 167 జాతీయ రహదారిపై పెట్రోల్ బంక్ సమీపంలో కల్వకుర్తి నుంచి వేగంగా వస్తున్న కారు లారీని ఓవర్ టెక్ చేస్తూ.. ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఘటనలో వెంకటయ్య, కొడుకు రాంచరణ్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. భార్య అనిత, కూతురు లిఖిత తీవ్రంగా గాయపడగా వారిని ఆసుపత్రికి తరలించారు.
తీవ్ర గాయాలతో భార్య అనిత మృతి చెందగా.. కూతురు లిఖిత ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో విషాదం అలుముకున్నది.