హైదరాబాద్, అక్టోబర్ 1(నమస్తే తెలంగాణ): తెలంగాణకు చెందిన మూడు చేనేత వస్ర్తాలకు యునెస్కో గుర్తింపు లభించింది. దేశవ్యాప్తంగా 47 విశిష్ట చేనేత సంప్రదాయ వస్ర్తాలు ఉన్నట్టు యునెస్కో వెల్లడించగా, అందులో మన రాష్ట్రంలోని హిమ్రూ, సిద్దిపేట గొల్లభామ, నల్లగొర్రెల గొంగడికి స్థానం దక్కింది. ‘21వ శతాబ్దం కోసం తయారుచేసిన చేనేత వస్ర్తాలు-సంప్రదాయ భారతీయ వస్ర్తాల సంరక్షణ’ పేరుతో విడుదల చేసిన నివేదికలో వీటికి చోటు దక్కడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది.
తెలంగాణ చేనేత వస్ర్తాలకు పెట్టింది పేరు. ఇక్కడ అనేకరకాల వస్ర్తాలు ప్రాచుర్యంలో ఉన్నాయి. కాలక్రమంలో అనేక అధునాతన వస్ర్తాలు మార్కెట్లోకి రావడంతో వీటికి ఆదరణ తగ్గిపోయింది. పురాతన వస్ర్తాలను మళ్లీ ప్రాచుర్యంలోకి తెచ్చేందుకు తెలంగాణ జౌళిశాఖ కృషిచేస్తున్నది. ఇందులో హిమ్రూ, సిద్దిపేట గొల్లభామ ముఖ్యమైనవి. పర్షియాకు చెందిన హిమ్రూ రకం వస్ర్తాలు మొదట మహమ్మద్ బిన్ తుగ్లక్ హయాంలో ఔరంగాబాద్కు తెచ్చారని, అనంతరం నిజాం నవాబులు షేర్వానీలుగా ఈ వస్ర్తాన్ని ఉపయోగించారని చరిత్రకారులు చెప్తారు. నిజాంపాలన అంతమయ్యాక క్రమంగా ఈ వస్ర్తాలకు ఆదరణ తగ్గుతూ వచ్చింది. కాగా, ఇటీవల తెలంగాణ జౌళిశాఖ ప్రత్యేకంగా ఈ వస్ర్తాలను స్థానిక నేతన్నలచే తయారు చేయిస్తున్నది.
సిద్దిపేట గొల్లభామ నూలు చీరలకు ప్రపంచవ్యాప్తంగా మంచి పేరున్నది. వీటికి విశిష్ట భౌగోళిక గుర్తింపూ ఉన్నది. తెలంగాణ జౌళిశాఖ వీటిని మళ్లీ తయారు చేయిస్తున్నది. తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్లో గొర్రెల ఊలుతో నేసే గొంగళ్లకు కూడా యునెస్కో గుర్తింపు లభించింది. వీటిని రెండు తెలుగు రాష్ర్టాల్లో కురుమ సామాజికవర్గం వారసత్వ సంప్రదాయంగా ఉపయోగిస్తున్నారు. కాలక్రమంలో వీటికి కూడా ఆదరణ తగ్గింది.